బైక్ను ఢీకొని మినీ లారీ దగ్ధం
రామభద్రపురం: సరిగ్గా శనివారం రాత్రి 11.45 గంటల సమయం. కొందరు నిద్రలో ఉన్నారు. మరికొందరు నిద్రలోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఇంకొందరు పనుల నిమిత్తం వెళ్లిన వారు ఇళ్లకు చేరుకుంటున్నారు. ఇంతలో రామభద్రపురం మండలకేంద్రంలోని సాలూరు వెళ్లే బైపాస్ రోడ్డులో పొట్టావాని కొనేరు సమీపంలో ఎగిసి పడుతున్న అగ్నికీలలు. కళ్ల ముందు భయానక వాతావరణం, ఏం జరుగుతోందో తెలీదు. లారీలో ఎందుకు మంటలు చేలరేగు తున్నాయో అర్థం కాని పరిస్థితి. గ్రామంలోని చుట్టుపక్కల నివాసాలకు చెందిన కొంతమంది యువకులు పరిగెత్తుకు వచ్చి చూసేసరికి ఓ వ్యక్తి గాయాలతో రోడ్డు పక్కనపడి ఉండడం,లారీ దగ్ధం కావడం చూసి వారంతా భయభ్రాంతులకు గురయ్యారు. లారీలో ఎవరైనా ఉన్నారా?ఉన్నవారికి ఏమైనా ప్రమాదం జిరిగిందా అని భయపడ్డారు. లారీ డ్రైవర్ దూకేశాడు. అందులో ఎవరు లేరనేసరికి అంతా ఊపిరి పీల్చుకున్నారు. అప్పుడు ఆ యువకులు పోలీసులకు, బాడంగి అగ్నిమాపక కేంద్రానికి సమాచారం ఇచ్చారు. విషయం తెలియడంతో రాత్రి పెట్రోలింగ్లో ఉన్న ఎస్సై వి.ప్రసాదరావు చేరుకుని ప్రమాదస్థలాన్ని పరిశీలించారు. స్థానిక యువకులు, ఎస్సై కలిసి రోడ్డు పక్కన గాయాలతో పడి ఉన్న వ్యక్తిని ప్రథమ చికిత్స నిమిత్తం 108 వాహనంలో బాడంగి సీహెచ్సీకి తరలించారు. ఆదివారం మరోసారి దగ్ధమైన లారీని పరిశీలించిన ఎస్సై తెలిపిన వివరాలిలా ఉన్నాయి.
తుని నుంచి ఒడిశా వెళ్తున్న మినీ లారీ
పాచిపెంట మండలం గడివలస గ్రామానికి చెందిన బెవర అప్పలనాయుడు మద్యం మత్తులో రామభద్రపురం మీదుగా తన అత్తవారి ఇంటికి బాడంగి మండలం రౌతువానివలస శనివారం రాత్రి వెళ్తున్నాడు. ఒడిశా రాష్ట్రానికి చెందిన మినీ లారీ తుని నుంచి గోగునారతో తయారు చేసిన గోనె సంచుల లోడుతో మితిమీరిన వేగంతో రామభద్రపురం బైపాస్ రోడ్డు మీదుగా ఒడిశాకు వెళ్తోంది. సరిగ్గా పొట్టావాని కోనేరు వద్దకు వచ్చేసరికి ఎదురుగా వస్తున్న ద్విచక్రవాహనదారు అప్పలనాయుడుని మినీ లారీ ఢీ కొట్టింది. దీంతో బైక్పై ఉన్న వ్యక్తి పక్కకు తుళ్లిపోగా తీవ్రగాయాలయ్యాయి. లారీ కింద ఇరుక్కుపోయిన అపాచీ బైక్ను వంద అడుగుల వరకు లారీ ఈడ్చుకెళ్లింది. తీవ్ర రాపిడితో బైక్ పెట్రోల్ ట్యాంకు పగిలి కర్నూలులోని వేమూరి కావేరి బస్సు ప్రమాదం తరహాలో మంటలు చెలరేగి లారీ ఇంజిన్ మొత్తం దగ్ధమైంది. లారీ కింద ఉన్న బైక్ ఆనవాళ్లు లేకుండా కాలిపోయింది. లారీలో ఉన్న సుమారు రూ.2 లక్షలు విలువ చేసే గోనె సంచులు పూర్తిగా దగ్ధమయ్యాయి. బాడంగి అగ్నిమాపక వాహనం వచ్చి కాలుతున్న మంటలను అదుపులోకి తెచ్చింది. ఆ సమయంలో దిచక్ర వాహనదారు పక్కకు తుళ్లిపోవడం, వాహనాలేవీ రాకపోవడంతో ఆస్తినష్టం తప్ప, ప్రాణనష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.లారీ కింద ఇరుక్కుపోయిన బైక్తో పాటు ద్విచక్రవాహనదారు చనిపోయి ఉంటాడని భయపడి లారీ డ్రైవర్ పరారయ్యాడు. క్షతగాత్రుడి ఫిర్యాదు మేరకు ఎస్సై వి.ప్రసాదరావు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న లారీ డ్రైవర్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.
కర్నూలులో జరిగిన తరహాలో ప్రమాదం
లారీకింద ఇరుక్కుపోయిన బైక్
వంద అడుగుల వరకు ఈడ్చుకెళ్లి ప్రమాదానికి గురైన లారీ
తీవ్రరాపిడితో బైక్ పెట్రోల్ ట్యాంకునుంచి చెలరేగిన మంటలు
బైకర్ మద్యం మత్తులో ఉన్నట్లు గుర్తించిన పోలీసులు
స్వల్పగాయాలతో బయటపడిన బైకర్
పెనుప్రమాదం తప్పడంతో
ఊపిరిపీల్చుకున్న స్థానికులు
పరారైన లారీ డ్రైవర్
బైక్ను ఢీకొని మినీ లారీ దగ్ధం


