
అర్జీల పరిష్కారానికి శ్రద్ధ తీసుకోవాలి
పార్వతీపురం రూరల్: ప్రతి సోమవారం కలెక్టర్ కార్యాలయంలో జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వచ్చే అర్జీలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి అధికారులు పనిచేయాలని కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ ఆదేశించారు. ఈ మేరకు సోమవారం 138 అర్జీలను కలెక్టర్తో పాటు పీఓ అశుతోష్ శ్రీవాత్సవ, డీఆర్ఓ కె. హేమలత కేఆర్సీ ఎస్డీసీ పి.ధర్మచంద్రారెడ్డి, డీఆర్డీఏ పీడీ ఎం.సుధారాణి స్వీకరించారు. నిర్దేశించిన గడువులోనే పెండింగ్లు లేకుండా అర్జీలను పరిష్కరించాలని అధికారుకు ఈ సందర్భంగా కలెక్టర్ స్పష్టం చేశారు. సమావేశంలో జిల్లాలోని పలు శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
వేగంగా సమస్యల పరిష్కారం
సమస్యలను వేగంగా పరిష్కరించడమే ప్రధాన ఉద్దేశమని ఎస్పీ ఎస్వీ మాధవ్ రెడ్డి అన్నారు. ఈ మేరకు సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లాలో ఉన్న పలు స్టేషన్ల పరిధిలలో నుంచి వచ్చిన ఫిర్యాదుదారుల నుంచి 13 ఫిర్యాదులు స్వీకరించి, అర్జీదారులతో ఎస్పీ ముఖాముఖి మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వారి ఫిర్యాదులను క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం సంబంధిత పోలీసు అధికారులతో స్వయంగా ఫోన్లో మాట్లాడి ఫిర్యాదు అంశాలను పరిశీలించి, వాటి పూర్వాపరాలను విచారణ చేసి, ఫిర్యాదు అంశాలు వాస్తవాలైనట్లయితే చట్ట పరిధిలో తక్షణ చర్యలు చేపట్టాలని, తీసుకున్న చర్యలకు సంబంధించిన నివేదికను జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయానికి పంపాలని ఆదేశించారు. కార్యక్రమంలో డీసీఆర్బీ సీఐ సుధాకర్, ఎస్సై ఫకృద్దీన్ తదితర సిబ్బంది ఉన్నారు.
ఐవీఆర్ఎస్ సంతృప్తికరంగా ఉండాలి
ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చిన సమస్యలపై అర్జీదారుల సంతృప్తిస్థాయి పెరగాల్సి ఉందని కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పేర్కొన్నారు. సమస్యల పరిష్కార విషయమై ఐవీఆర్ఎస్ ద్వారా ప్రభుత్వం చేసే సర్వేలో శతశాతం సంతృప్తికరంగా ఉన్నట్లు అర్జీదారుల స్పందన ఉండాలని స్పష్టం చేశారు. ఈ మేరకు అధికారులు బాధ్యతగా వ్యవహరించాలన్నారు. ఈ సర్వేలో శతశాతం సంతృప్తి చెందకపోతే సంబంధిత అధికారులను బాధ్యులుగా చేస్తామని హెచ్చరించారు. ఈ మేరకు కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో సోమవారం పీజీఆర్ఎస్, పీ4, పీఎం సూర్యఘర్, ఈపీటీఎస్ తదితర అంశాలపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారులతో సమీక్షించారు. సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ఎస్ శోభిక, ఐటీడీఏ పీఓలు అశుతోష్శ్రీవాత్సవ, సి.యశ్వంత్ కుమార్ రెడ్డి, డీఆర్ఓ కె. హేమలత, ఎస్డీసీలు పి. ధర్మచంద్రారెడ్డి, ఎస్. దిలీప్ చక్రవర్తి, డీఆర్డీఏ పీడీ ఎం. సుధారాణి, డీఈఓ బి. రాజ్కుమార్, డీఐఈఓ వై. నాగేశ్వరరావు, సమగ్ర శిక్ష ఏపీసీ ఆర్. తేజేశ్వరరావు, ఈపీడీసీఎల్ ఎస్ఈకె మల్లికార్జునరావు, డీఎంఅండ్హెచ్ఓ డా. భాస్కరరావు, డీఏ హెచ్ఓ డా. మన్మధరావు, డీబీసీ డబ్ల్యూఓ అప్పన్న, డీఆర్డబ్ల్యూఎస్ఈఓ ప్రభాకరరావు, సీడీపీఓ శాంతి భవాని, వివిధ అధికారులు పాల్గొన్నారు.
కలెక్టర్ ఎ.శ్యామ్ప్రసాద్

అర్జీల పరిష్కారానికి శ్రద్ధ తీసుకోవాలి