
బెదిరింపు ప్రకటనలు సరికాదు
● జిందాల్ భూములను రైతులకు అప్పగించాలి
● సీపీఎం జిల్లా కార్యదర్మి తమ్మినేని సూర్యనారాయణ
విజయనగరం గంటస్తంభం: 2006లో జిందాల్ పరిశ్రమ ఏర్పాటు కోసం తీసుకున్న భూములను చట్టప్రకారం పరిశ్రమ పెట్టనందున రైతులకు తిరిగి ఇవ్వాలని సీపీఎం జిల్లా కార్యదర్శి తమ్మినేని సూర్యనారాయణ డిమాండ్ చేశారు. చట్ట ప్రకారం వ్యవహరించాల్సిన అధికారులు, ప్రజాప్రతినిధులు బెదిరింపు ప్రకటనలు చేయడం సమంజసం కాదని అన్నారు. ఈ మేరకు సోమవారం ఆయన విజయనగరంలోని ఎల్బీజీ భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. రైతుల నుంచి భూములు తీసుకుని 17 సంవత్సరాలైనా నేటివరకు ఎటువంటి పరిశ్రమలు ఏర్పాటు చేయలేదని, స్థానిక ప్రజలకు ఉపాధి చూపలేదన్నారు. 2013 భూసేకరణ చట్టం ప్రకారం రైతుల నుంచి తీసుకున్న భూములను ఐదేళ్లలో పరిశ్రమ కట్టకపోతే తిరిగి రైతులకు అప్పజెప్పాలని చట్టంలో ఉన్న విషయం అధికారులకు తెలియదా? అని ప్రశ్నించారు. 2006 భూ సేకరణకు ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం ఎందుకు అప్పటి జాయింట్ కలెక్టర్ నిర్వహించారని ప్రశ్నించారు. అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం భూ సేకరణ చేస్తే ఇప్పుడు అధికారంలో ఉన్న టీడీపీ నాయకులు ఆ రోజు పరిశ్రమను వ్యతిరేకించిన విషయం మర్చిపోయారా అని ప్రశ్నించారు. పరిశ్రమ పెట్టకపోతే భూములు వెనక్కి ఇవ్వకుండా ఇప్పుడు ఎంఎస్ఎంఈ పార్కు పెడతామని, అడ్డుకుంటే చర్యలు తీసుకుంటామని కలెక్టర్ బెదిరించడాన్ని ఖండిస్తున్నామన్నారు. కేవలం కార్పొరేట్ శక్తులకు ఈ భూములు అప్పగించాలన్న కుట్ర తప్ప మరొకటి కాదన్నారు. ఒక వేళ కొత్త పరిశ్రమ కోసం భూమి కావాలంటే పబ్లిక్ హియరింగ్ పెట్టి మళ్లీ భూ సేకరణ చేపట్టి రైతులకు ఇవ్వాల్సిన నష్టపరిహారం చెల్లించి తీసుకోవాలి తప్ప బెదిరించి తీసుకుంటామని అనడం సరికాదన్నారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యులు రెడ్డి శంకరరావు, టీవీ.రమణ పాల్గొన్నారు.