
‘మధ్యతరగతి మందహాసం’ పుస్తకావిష్కరణ
విజయనగరం టౌన్: బెహరా వెంకట సుబ్బారావు సర్వ లభ్యరచనల పుస్తకం ‘మధ్యతరగతి మందహాసం’ పుస్తకావిష్కరణ కార్యక్రమం అరసం జిల్లాశాఖ ఆధ్వర్యంలో జెడ్పీ సమావేశమందిరంలో ఆదివారం వేడుకగా నిర్వహించారు. కార్యక్రమానికి కలిగొట్ల సన్యాసిరాజు అధ్యక్ష్యత వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన బహుభాషా గ్రంథకర్త డాక్టర్ వీవీవీ.రమణ మధ్యతరగతి గాథలు, వ్యథలను స్వయంగా పరిశీలించి, అనుభవించి రాసిన గొప్ప రచయిత బెహరా సుబ్బారావు అని ప్రశంసించారు. మన జీవితాల్లో జరుగుతున్న అనేక సంఘటనల సమాహారం మధ్యతరగి మందహాసమని విశిష్ట అతిథి, వ్యంగ్య కథల రచయిత డాక్టర్ కొచ్చర్లకోట జగదీష్ పేర్కొన్నారు. ప్రముఖ జర్నలిస్ట్ కేఎస్ఎస్ బాపూజీ కథలపై సమీక్ష చేస్తూ సునిశతమైన హాస్యాన్ని కథలలో జోడిస్తూ తాను చెప్పాల్సిన విషయాన్ని సున్నితంగా చెబుతూ ప్రతి కథకు గొప్ప కొసమెరుపులిచ్చారన్నారు. పుస్తక సంపాదకుడి సుబ్బారావు కుమారుడు మూర్తి మాట్లాడుతూ నాన్నగారి కథలు మూఢ నమ్మకాలకు వ్యతిరేకంగా సామాజిక చైతన్యానికి దోహద పడ్డాయన్నారు. సుబ్బారావు కథలు మధ్యతరగతి మహాభారతమని, అటువంటి గొప్ప కథల పుస్తకాన్ని సుబ్బారావు పుత్రుడు మూర్తి పెద్ద గ్రంథంగా తీసుకురావడం తండ్రిరుణం తీర్చుకున్న కుమారుడిగా ధన్యుడయ్యాడని అరసం జిల్లా అధ్యక్ష్యుడు జీఎస్.చలం పేర్కొన్నారు. ప్రముఖ కవి, రచయిత రాజోలు నుంచి హాజరైన ఎం.ఎస్.సూర్యనారాయణ కథల మీద సమగ్రమైన విమర్శ రావాలని, ప్రముఖ విశ్వవిద్యాలయాల్లో పరిశోధన జరగాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. అరసం జిల్లా ప్రధాన కార్యదర్శి రత్నాల బాలకృష్ణ సభా కార్యక్రమాన్ని నిర్వహించారు. అధిక సంఖ్యలో సాహితీవేత్తలు, అభిమానులు పాల్గొన్నారు.