
ఎంటీఎస్లకు అన్యాయం!
ఉపాధ్యాయ
బదిలీల్లో...
పార్వతీపురం టౌన్: ఇటీవల జరిగిన ఉపాధ్యాయుల బదిలీల అనంతరం జిల్లాలో పలు పాఠశాలల్లో ఖాళీలు ఏర్పడ్డాయి. వీటిని ఎంటీఎస్లతో సర్దుబాటు చేసేందుకు వారం రోజుల కిందట కౌన్సెలింగ్ నిర్వహించారు. ఈ కౌన్సెలింగ్లో తమకు తీరని అన్యాయం జరిగిందని మినిమమ్ టైమ్ స్కేల్ ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 475మంది ఎంటీఎస్ ఉపాధ్యాయులు విధులు నిర్వహిస్తున్నారు. 1998, 2008 డీఎస్సీ బ్యాచ్లకు చెందిన వీరంతా మినిమమ్ టైమ్ స్కేల్ విధానంలో జిల్లాలో వివిధ పాఠశాలల్లో ఎస్జీటీలుగా విధులు నిర్వహిస్తున్నారు. ఇటీవల జరిగిన రెగ్యులర్ బదిలీల అనంతరం సుదూర ప్రాంతాల్లో ఖాళీలు ఏర్పడ్డాయి. ఫలితంగా ప్రస్తుతం పని చేస్తున్న ప్రాంతాలకు దూరంగా సుమారు 70–100 కిలోమీటర్లు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ బదిలీలపై ఎంటీఎస్ ఉపాధ్యాయులు వ్యతిరేకించినా ఫలితం లేకపోయింది. అరకొర జీతాలతో కుటుంబాన్ని నెట్టుకొస్తున్న తాము దూర ప్రాంతాలకు వెెళ్లి విధులు నిర్వహిస్తున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమలో సుమారు 80శాతం మంది రెండు మూడేళ్లలో ఉద్యోగ విరమణ చేయాల్సిన వారే ఉన్నారని చెబుతున్నారు. మండలాలకు ఎంటీఎస్లను పంపినా.. ప్రభుత్వం నుంచి మార్గదర్శకాలు లేవనే కారణంతో 50శాతం మందికి పైగా ఎంటీఎస్లను విధుల్లోకి తీసుకోకపోవడం ఆశ్చర్యానికి గురి చేస్తుంది.
క్లస్టర్ విధానంతో పాట్లు
ప్రభుత్వం నూతనంగా ఏర్పాటు చేసిన క్లస్టర్ విధానం వల్ల తమకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఎంటీఎస్ ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. క్లస్టర్ విధానంలో ఎస్జీటీలతో కొన్ని ఉన్నత పాఠశాలలకు తాత్కాలికంగా భర్తీ చేశారు. కమిషనర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ మార్గదర్శకాలు రాలేదని అధికారులు చెబుతుండంతో ఎంటీఎస్ ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు. కౌన్సెలింగ్ పూర్తయి వారం రోజులు గడుస్తున్నా.. పాఠశాలలు కేటాయించడం లేదని వాపోతున్నారు. విజయనగరం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 475 మంది ఎంటీఎస్ ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు.
ఎంటీఎస్ ఉపాధ్యాయుల సమస్యలు ఇవే...
కేవలం రూ.32 వేలతో పని చేస్తున్న ఎంటీఎస్ ఉపాధ్యాయులను పని చేస్తున్న మండలాల్లో సర్దుబాటు చేయలేదు. ప్రతీ మండలంలో ఉన్న మోడల్ స్కూల్లో ఒక ఎంటీఎస్ను నియమించలేదు. ప్రభుత్వం చూపిస్తున్న ఖాళీలు నివాస ప్రాంతాలకు 200 కిలోమీటర్లు ఉన్నందున ప్రభుత్వం ఇచ్చే జీతం ప్రయాణ ఖర్చులకే సరిపోతుంది. తప్పనిసరి పరిస్థితుల్లో ప్రస్తుత ఖాళీల్లో సర్దుబాటు చేయాల్సి వస్తే హెచ్ఆర్ఎ, డీఏ ఇచ్చి రెగ్యులరైజేషన్ చేయాలి. జిల్లా వ్యాప్తంగా ప్రతీ క్లస్టర్లో క్లస్టర్ వేకెన్సీలు సృష్టించి ఎంటీఎస్లకు సర్దుబాటు చేయడంలేదు. దివ్యాంగులుగా ఉన్న ఎంటీఎస్లకు వారు కోరుకున్న మండలంలో పని చేసేందుకు అవకాశం కల్పించడం లేదు. మున్సిపల్ పాఠశాలలో వేకెన్సీలను కూడా 15 నుంచి 20మంది విద్యార్థులున్న ప్రతీ పాఠశాలలో ఒక ఎంటీఎస్ ఉపాధ్యాయుడిని నియమించాలి.
పాఠశాలలు కేటాయించాలి
ఎంటీఎస్లకు పాఠశాలలు కేటాయించాలి. దివ్యాంగులుగా ఉన్న ఎంటీఎస్లకు వారు కోరుకున్న మండలంలో పని చేసేందుకు అవకాశం కల్పించడం లేదు. అరకొర జీతాలతో కుటుంబాన్ని నెట్టుకొస్తున్న తాము దూర ప్రాంతాలకు వెళ్లి విధులు నిర్వహిస్తున్నాం. ప్రభుత్వం, అధికారులు పునరాలోచించాలి. కొమరాడ మండలంలో క్లస్టర్కు కేటాయించారు. కాని పాఠశాల కేటాయించలేదు.
– ఎంటీఎస్ ఉపాధ్యాయుడు
క్లస్టర్ విధానంతో పాట్లు
మండలాలను కేటాయించినా.. విధుల్లో చేర్చుకోని వైనం
క్లస్టర్ పాఠశాలలకు నియామకం
ఆందోళనలో ఎంటీఎస్లు
ప్రభుత్వం నుంచి మార్గదర్శకాలు రాలేదంటున్న అధికారులు
ఉమ్మడి జిల్లాలో 475 మంది ఎంటీఎస్ ఉపాధ్యాయులు