
పెదపెంకి.. మూత‘బడి’!
సాక్షి, పార్వతీపురం మన్యం: బలిజిపేట మండలం పెదపెంకి–1 పాఠశాల కొద్దిరోజులుగా మూతపడే ఉంటోంది. 3, 4, 5 తరగతులను మరోచోటకు విలీనం చేయడాన్ని నిరసిస్తూ, కొద్దిరోజులుగా పాఠశాల విద్యార్థులు, తల్లిదండ్రులు నిరసన వ్యక్తం చేస్తున్న విషయం విదితమే. వీరి ఆవేదనను ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. దీంతో 1, 2 తరగతులకు కూడా విద్యార్థులను గ్రామస్తులు పంపడం లేదు. ఉపాధ్యాయులు వస్తున్నా పిల్లలెవరూ రాకపోవడంతో పాఠాలు సాగని పరిస్థితి. శనివారం ఇన్చార్జి డీఈఓ రాజ్కుమార్ గ్రామానికి వెళ్లి తల్లిదండ్రులతో మాట్లాడారు. అధికారులెంత ప్రయత్నాలు చేస్తున్నా.. తమ విద్యార్థులను మరో పాఠశాలకు భయంభయంగా పంపలేమని వారు స్పష్టం చేస్తున్నారు.
సజావుగా వెల్ఫేర్ అసిస్టెంట్ల బదిలీలు
పార్వతీపురం: ఐటీడీఏ పరిధిలోని గ్రామ సచివాలయ వెల్ఫేర్ అసిస్టెంట్ల బదిలీ ప్రక్రియ శనివారం సజావుగా సాగింది. ఐటీడీఏ కార్యాలయంలో గిరిజన సంక్షేమశాఖ ఉప సంచాలకుడు ఆర్.కృష్ణవేణి, సూపరింటెండెంట్ కె.దేష్, ఏటీడబ్ల్యూఓ కె.చంద్రబాబు ఆధ్వర్యంలో సచివాలయ వెల్ఫేర్ అసిస్టెంట్ల బదిలీ ప్రక్రియ జరిగింది. బదిలీల్లో 56 మంది వెల్ఫేర్ అసిస్టెంట్లకు స్థాన చలనం కలిగింది. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నిబంధనలకు లోబడి బదిలీ ప్రక్రియ చేపట్టినట్టు కృష్ణవేణి తెలిపారు.
గిరిజన విద్యార్థులు విద్యాభ్యాసానికి దూరం కారాదు
● రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ డాక్టర్
శంకరరావు
విజయనగరం అర్బన్: ఉపాధ్యాయులు లేక అరకు మండలం లో తేరు పంచాయతీ పరి ధిలోని వంతులగుడ, తోడుబంద, ఈడారి, దంసానివలస, బొరకాలవలస, లండిగుడ, కాగువలస, తదితర పాఠశాలలు ఇప్పటికీ తెరుచుకోలేదన్న వార్తలపై రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ డాక్టర్ డీవీజీ శంకరరావు స్పందించారు. మీడియాతో శనివారం మాట్లాడుతూ సంబంధిత అధికారులు గిరిజన విద్యార్థులు విద్యావకాశాలను కోల్పోకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. గిరిజన గ్రామాల్లోని బడి ఈడు పిల్లలందరూ విద్యనభ్యసించేలా చూడాలన్నారు. ఆయా గ్రామాల్లో విద్యార్థుల పాఠశాల విద్యపై క్షేత్రస్థాయిలో విద్యాశాఖ అధికారులు దృష్టి సారించాలని కోరారు. ఇప్పటికే పాఠశాలలు ప్రారంభమైనందున విద్యార్థులు పాఠశాలలకు వచ్చి చదువుకునేలా చూడాలన్నారు.
తల్లీబిడ్డలకు ఎఫ్ఆర్ఎస్ కష్టాలు
సీతంపేట: మన్యంలోని తల్లీబిడ్డలకు ఎఫ్ఆర్ఎస్ (ఫేషియల్ రికగ్నేషన్ సిస్టం) రిజిస్ట్రేషన్ కష్టాలు వెంటాడుతున్నాయి. సిగ్నల్ లేకపోవడంతో పిల్లలను చంకన ఎత్తుకుని కొండలు దిగి సీతంపేట ఐసీడీఎస్ కార్యాలయానికి తరలివస్తున్నారు. యాప్లో నమోదు కాకపోతే వచ్చేనెలలో పోషణ పథకంలో భాగంగా ఐసీడీఎస్ లబ్ధిదారులకు ఎటువంటి టేక్హోం రేషన్ అందదని సంబంధిత అధికారులు చెప్పడంతో శనివారం అధిక సంఖ్యలో ఐసీడీఎస్ కార్యాలయానికి చేరుకున్నారు. బాలింతలు, గర్భిణులు, 7 నెలల నుంచి మూడేళ్ల మధ్య ఉన్న చిన్నారులు 4,612 మంది ఉండగా వీరిలో అర్హులు 3,113 మంది ఎఫ్ఆర్ఎస్ చేయించుకోవాల్సి ఉంది. ఇప్పటివరకు 2,150 మంది మాత్రమే ఎఫ్ఆర్ఎస్ రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఈ నెలాఖరులోగా మిగిలిన వారంతా ఎఫ్ఆర్ఎస్ రిజిస్ట్రేషన్ చేసుకునేలా చర్యలు తీసుకుంటున్నట్టు సీడీపీఓ సిమ్మాలమ్మ తెలిపారు.

పెదపెంకి.. మూత‘బడి’!