
పిల్లలు లేని ఫౌండేషన్ స్కూల్!
బోధించేందుకు టీచర్ ఉన్నారు. కానీ పాఠాలు వినేందుకు ఒక్క విద్యార్థి కూడా లేరు. ఇది సంతకవిటి మండలం గుజ్జన్నపేట ప్రాథమిక పాఠశాల దుస్థితి. దీనిని కూటమి ప్రభుత్వం ఈ ఏడాది ఫౌండేషన్ స్కూల్గా మార్పుచేసి ఇక్కడ కొనసాగే 3, 4, 5 తరగతులను చిత్తారిపురం యూపీ స్కూల్లో విలీనం చేసింది. ఇప్పటివరకు ఇక్కడ రెండో తరగతి చదుతున్న ఒకే ఒక విద్యార్థి కూడా ప్రస్తుతం పాఠశాలకు రావడం లేదు. కొత్తగా ఒకటి రెండు తరగతుల్లో విద్యార్థులు ఎవరూ చేరలేదు. అంతే... టీచర్ ఎస్.నారాయణమ్మ విధులకు సమయానికి హాజరుకావడం, వెళ్లిపోవడమే జరుగుతోంది. విద్యాశాఖాధికారులు స్పందించి ఫౌండేషన్ స్కూల్ను రద్దుచేసి, ప్రాథమిక పాఠశాలను కొనసాగించాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఏం చేస్తారో వేచిచూడాల్సిందే.
– సంతకవిటి