
రెండు లారీలు ఢీ కొని బిహార్ వాసి మృతి
రామభద్రపురం: మండలంలోని కొండకెంగువ వద్ద గ్రీన్ఫీల్డ్ హైవేపై రెండు లారీలు ఢీ కొనడంతో జరిగిన ప్రమాదంలో బిహార్ వాసి ఒకరు ఆదివారం మృతిచెందారు. ఈ సంఘటనపై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బిహార్లోని పాట్నా జిల్లాకు చెందిన సైలేస్ సాహు(40) జీవనోపాధి నిమిత్తం గడిచిన మూడేళ్లుగా హెచ్జీ ఇన్ఫ్రా కంపెనీలోని కొండకెంగువ వద్ద ఏర్పాటు చేసిన క్యాంపు–1లో పనిచేస్తున్నాడు. అయితే పనినిమిత్తం పాచిపెంట వద్ద ఏర్పాటు చేసిన క్యాంపు–2కు వెళ్లి పని ముగించుకుని తిరిగి క్యాంప్–1కు లారీలో వస్తుండగా హెచ్జీ ఇన్ఫ్రా కంపెనీ నిర్మిస్తున్న గ్రీన్ఫీల్డ్ హైవేపై ఆ హైవేకు సంబంధించిన మరో లారీ ఎదురుగా వస్తూ ఢీ కొంది. దీంతో సాహు ప్రయాణిస్తున్న లారీ తలుపు తెరుచుకుని కిందపడడంతో లారీ చక్రాలు, రోడ్డు పక్కనే ఉన్న డివైడర్ మధ్య నలిగి ముద్దయ్యాడు. అదే లారీలో ఉన్న డ్రైవర్ శివ ఠాకూర్కు స్వల్ప గాయాలయ్యాయి. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించేందుకు వీలు లేనంతగా ముద్దవడంతో బాడంగి సీహెచ్సీ వైద్యాధికారి ఆధ్వర్యంలో ఘటనా స్థలంలోనే పోస్టుమార్టం నిర్వహించారు.డ్రైవర్ శివ ఠాకూర్ ఫిర్యాదు మేరకు ఎస్సై వి. ప్రసాదరావు కేసునమోదు చేసి దర్యాప్తుచేస్తున్నారు. మృతుడు సాహుకు భార్య, పాప, బాబు ఉన్నారు.
రైలు నుంచి జారిపడి వ్యక్తికి తీవ్రగాయాలు
గజపతినగరం: మండల కేంద్రంలోని రైల్వే బ్రిడ్జి సమీపంలో ట్రైన్లో ప్రయాణిస్తూ ఓ వ్యక్తి జారిపడి తీవ్ర గాయాలపాలయ్యాడు. గజపతినగరం రైల్వే స్టేషన్ మీదుగా విశాఖ వెళ్తున్న పాసింజర్ ట్రైన్లో నుంచి విజయవర్మ అనే వ్యక్తి జారి పడి తీవ్రగాయాల పాలు కావడంతో స్థానికులు గుర్తించి ఆస్పత్రికి తరలించగా ప్రథమచికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం విజయనగరం మహారాజా ఆస్పత్రికి తరలించారు.