దొంగ బిల్లుల బాగోతం | - | Sakshi
Sakshi News home page

దొంగ బిల్లుల బాగోతం

May 25 2025 8:12 AM | Updated on May 25 2025 8:12 AM

దొంగ

దొంగ బిల్లుల బాగోతం

‘తోటపల్లి’ సాక్షిగా...

వీరఘట్టం: తోటపల్లి ప్రాజెక్టు పరిధిలోని కాలువల ఆధునికీకరణ పనులు నిలిచిపోయాయి. రానున్న ఖరీఫ్‌కు సాగునీరు సక్రమంగా సరఫరా చేసేందుకు వీలుగా పాత ఆయకట్టు కాలువలను బాగుచేసేందుకు రాష్ట్ర విపత్తు ఉపశమననిధి (ఎస్‌డీఎంఎఫ్‌) కింద రూ.30.80 లక్షలు మంజూరయ్యాయి. ఈ నిధులతో కాలువలో పేరుకుపోయిన పిచ్చిమొక్కలు, పూడికలు తొలగించాలి. జలవనరులశాఖలో ఉన్న కొందరు అధికారులు ఎడమ కాలువలో గుర్తించిన 8 పనుల్లో ఏడు పనులు చేయకుండానే పనులు చేసినట్లు బిల్లులు సృష్టించారు. ఈ పనులకు సంబంధించిన ఫైల్‌ను క్వాలీటీ అధికారులకు నివేదించారు. వారు కనీసం పనులు జరిగాయా లేదా అని పరిశీలన చేయకుండా పనులు నాణ్యతా ప్రమాణాలతో చేసినట్టు నిర్ధారిస్తూ క్వాలిటీ నివేదిక సైతం ఇచ్చేశారు. ఇలా కింది స్థాయి నుంచి పై స్థాయి అధికారుల వరకు జరగని పనులకు జరిగినట్లుగా బిల్లులు సిద్ధం చేసి రూ.23.54 లక్షలు కాజేసేందుకు ఎత్తుగడ వేశారు. ప్రస్తుతం ఈ బిల్లుల ఫైల్‌ రాష్ట్ర జలవనరులశాఖ కార్యాలయంలో మంజూరుకు సిద్ధంగా ఉంది. మరో రెండు రోజుల్లో బిల్లులు మంజూరయ్యే అవకాశం ఉన్నట్టు సమాచారం. ఇంతలో ఈ దొంగ బిల్లుల వ్యవహారం వెలుగుచూడడంతో రైతన్నలు విస్మయం చెందుతున్నారు. ఇప్పటికే అడపాదడపా వర్షాలు కురుస్తుండడంతో ఖరీఫ్‌ పనులు ఆరంభమయ్యాయి. కాలువల్లో నీరు చేరింది.. ఇదే అదునుగా పనులు చేయకుండానే చేసినట్టు చూపించి బిల్లులు కాజేసేందుకు అధికారులు స్కెచ్‌ వేశారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

ఆందోళనలో రైతన్నలు...

ఓ పక్క తోటపల్లి ఆధునికీకరణ పనులు ఆగిపోయాయి. ఈ ఏడాది ఖరీఫ్‌కు సాగునీరు వస్తుందా, రాదా అనే ఆందోళనలో రైతులు బిక్కుబిక్కుమంటున్నారు. ఈ తరుణంలో కాలువలో పూడికలు తొలగించి సకాలంలో సాగునీరు అందించాల్సిన జలవనరులశాఖ అధికారులు ఇటువంటి పనులు చేపట్టడం అన్యాయమని రైతులు మండిపడుతున్నారు. ఇటువంటి అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

తమకేమీ తెలీదంటున్న క్వాలిటీ అధికారులు...

ఎడమకాలువలో ఎస్‌డీఎంఎఫ్‌ నిధులతో చేపట్టాల్సిన పనులు చేయకుండానే వాటికి క్వాలిటీ సర్టిఫికెట్‌ ఎలా ఇచ్చారని క్వాలీటీ కంట్రోల్‌ డీఈఈ వద్ద ‘సాక్షి’ ప్రస్తావించగా మా వద్ద కు ఎన్నో వర్కులు వస్తుంటాయని, అందులో మీరు అడిగిన వర్కులు వచ్చాయో లేదో అని దాటవేస్తూ సమాధానం ఇచ్చారు.

●తురకనాయుడువలస నుంచి 1వ బ్రాంచ్‌ కాలువలో రెండు చోట్ల రూ.3.80 లక్షలతో రెండు పనులు, తోటపల్లి ఎడమ ప్రధాన కాలువలో రూ.4 లక్షలతో, మరో చోట మరో రూ.4.74 లక్షలతో, ఎడమకాలువ పరిధిలో ఉన్న చలివేంద్రి బ్రాంచ్‌ కాలువలో మట్టి తీయించేందుకు రూ.1.50 లక్షలు నిధులు మంజూరయ్యాయి. ఈ వర్కులన్నీ పూర్తి చేసినట్లు జలవనరులశాఖ అధికారులు తప్పుడు బిల్లులు సృష్టించారు. ఎడమ కాలువ పరిధిలోని మొత్తం ఏడు పనులను రూ.23.54 లక్షలో చేపట్టినట్లు బిల్లులు తయారు చేసి ప్రభుత్వానికి పంపించారు. ప్రస్తుతం శ్రీకాకుళం జలవనరులశాఖ డివిజనల్‌ కార్యాలయంలో ఈ పనులకు సంబంధించిన ఎమ్‌ బుక్‌లు, క్వాలిటీ సర్టిఫికెట్లు పేమెంట్‌ కోసం సిద్ధంగా ఉన్నట్టు సమాచారం.

అసలు పని చేయనేలేదు.. రూ.23.54 లక్షలకు బిల్లు పెట్టేశారు. ఆ పనులు నాణ్యతతో చేసినట్టు క్వాలిటీ కంట్రోల్‌ అధికారులు కూడా ధ్రువీకరించేశారు. కింది నుంచి పై స్థాయి వరకు ప్రజాధనం దోచుకునేందుకు పక్కా స్కెచ్‌ వేశారు. ఇది కాస్త బహిర్గతమయ్యేసరికి తడుముకుంటున్నారు. తోటపల్లి కాలువల సాక్షిగా జలవనరుల శాఖలో సాగుతున్న అవినీతి తంతుపై

రైతాంగం గుర్రుమంటోంది.

పనులు చేయకుండానే బిల్లుల నమోదు

రూ.23.54 లక్షల ఎస్‌డీఎంఎఫ్‌ నిధులు కాజేసేందుకు స్కెచ్‌!

చేయని పనులకు నాణ్యతతో చేసినట్టు ధ్రువీకరించిన క్వాలిటీకంట్రోల్‌

అధికారులు

కిందిస్థాయి నుంచి పైస్థాయి వరకు పనులు జరిగినట్టు సంతకాలు

ఒకటిరెండు రోజుల్లో బిల్లులు

మంజూరయ్యే అవకాశం

వెలుగుచూసిన జలవనరుశాఖలో అవినీతి పర్వం

రెండు రోజుల్లో పనులు చేపడతాం

ఎడమకాలువలో ఎస్‌డీఎంఎఫ్‌ నిధులతో చేపట్టాల్సిన పనుల కాల పరమితి మార్చితో పూర్తయింది. అందుకే ఆ నిధులు వెనుకకు వెళ్లిపోతాయని ముందుగా బిల్లులు సిద్ధంచేశాం. అంతే తప్ప ఇందులో ఎటువంటి దురుద్దేశం లేదు. రెండు రోజుల్లో కాలువలో పనులు చేపడతాం.

– డి.వి.రమణ,

ఏఈ, జలవనరులశాఖ, వీరఘట్టం

ఇది తోటపల్లి ఎడమకాలువలోని 1వ బ్రాంచ్‌లోని కెల్ల చానల్‌. ఈ కాలువలో మట్టి పనులు చేసేందుకు రూ.5 లక్షల ఎస్‌డీఎంఎఫ్‌ నిధులు మంజూరు చేశారు. అయితే జలవనరులశాఖ అధికారులు మాత్రం ఈ కాలువలో ఎలాంటి పనులు చేయలేదు. ఒక్క పిచ్చిమొక్కకూడా తొలగించలేదు. కానీ, రూ.5 లక్షలు వెచ్చించి పనులు చేసినట్టు ఎమ్‌ బుక్‌లో రికార్డు చేసేశారు. ఇక్కడ చేపట్టిన పనులు ఎంతో నాణ్యతతో ఉన్నట్లు క్వాలిటీ అధికారులు ధ్రువీకరించి క్వాలిటీ సర్టిఫికెట్‌ కూడా ఇచ్చేయడం గమనార్హం.

ఇది తోటపల్లి ఎడమకాలువలోని 2వ బ్రాంచ్‌ కాలువ. ఈ కాలువలో మట్టి పనులు చేసేందుకు రూ.4.50 లక్షలు మంజూరయ్యాయి. ఇక్కడ కూడా పనులు చేపట్టినట్లు అధికారులు తప్పుడు పత్రాలు సిద్ధం చేశారు.

పనులు చేపట్టకుండా బిల్లులు పెట్టకూడదు

ఏ పనులైనా చేపట్టకుండా బిల్లులు పెట్టకూడదు. తోటపల్లి కాలువలో ఎస్‌డీఎంఎఫ్‌ నిధులతో మంజూరైన పనుల బిల్లులు ఇంకా రాలేదు. ఈ విషయంపై పూర్తిస్థాయిలో విచారణ చేపడతాం. అవసరమైతే ఫీల్డ్‌కు వెళ్లి తనిఖీలు చేస్తాను.

– పి.సుధాకరరావు,

ఈఈ, జలవనరులశాఖ, శ్రీకాకుళం

దొంగ బిల్లుల బాగోతం1
1/3

దొంగ బిల్లుల బాగోతం

దొంగ బిల్లుల బాగోతం2
2/3

దొంగ బిల్లుల బాగోతం

దొంగ బిల్లుల బాగోతం3
3/3

దొంగ బిల్లుల బాగోతం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement