
ముగ్గురు సైబర్ నేరగాళ్ల అరెస్ట్
పాలకొండ: ఇటీవల సైబర్ క్రైమ్ కేసులను పోలీసులు త్వరగా ఛేదించి మన్ననలు అందుకుంటున్నారు. పాలకొండ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగిన పలు సైబర్ నేరాలను ఇప్పటికే ఛేదించిన పోలీసులు తాజాగా ఫోన్ దొంగిలించి అందులోని ఫోన్పే ద్వారా డబ్బులు కాజేస్తున్న ముఠాను పట్టుకున్నారు. ఆ ముఠాలోని పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. ఈ మేరకు ఆ వివరాలను డీఎస్పీ ఎం.రాంబాబు గురువారం విలేకరుల సమావేశంలో వివరించారు. గత ఏడాది నవంబర్ నెలలో తన ఫోన్ దొంగిలించి ఫోన్పే ద్వారా డబ్బులు కాజేస్తున్నారని భామిని మండలానికి చెందిన బోదేపు నారాయణరావు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పాలకొండలో పనులు పూర్తి చేసుకుని ఆర్టీసీ కాంప్లెక్స్లో బస్సుకోసం వేచి ఉన్న సయమంలో ఫోన్ దొంగతనానికి గురైనట్లు ఫిర్యాదులో పేర్కొన్నాడు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు సైబర్ క్రైమ్ టీమ్ను అప్రమత్తం చేసి ఖాతాలో ఉన్న మిగతా మొత్తం విత్డ్రా చేయకుండా చర్యలు తీసుకున్నారు. అనంతరం అప్పటికే ఫోన్పే ద్వారా రూ.92, 200 డ్రా చేయడంతో దాని ఆధారంగా కేసు దర్యప్తు చేపట్టారు. నిందితులు చిలకపాలెం పెట్రోల్ బంక్లో ఫోన్పే చేసి డబ్బులు తీసుకున్నట్లు గుర్తించారు. ఇలా పలు చోట్ల ఫోన్ పే చేస్తాం డబ్బులు కావాలని అడిగి నగదు తీసుకున్నారు. దీంతో సీఐ చంద్రమౌళి ఆధ్వర్యంలో సాంకేతికను ఉపయోగించి నిందితులు తిరుగుతున్న ప్రాంతాలను గుర్తించారు. బుధవారం మరోసారి నిందితులు పాలకొండ వచ్చి ఒక లాడ్జిలో బస చేయడంతో పోలీసులు వారిని అరెస్టు చేశారు. నిందితుల్లో పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన మేకల వెంకటేష్, విజయనగరం జిల్లాకు చెందిన పసుపురెడ్డి గోపీచందు, పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన మహమ్మద్ బాషాలను అరెస్టు చేశారు. నిందితుల నుంచి మూడు సెల్ఫోన్లు, రూ.92, 200 నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసు దర్యప్తులో కీలకంగా వ్యవరించిన సీఐ, ఎస్సై, సిబ్బందిని డీఎస్పీ అభినందించారు.
వివరాలు వెల్లడించిన డీఎస్పీ