సీతానగరం: జనావాసాల మధ్య ఏనుగుల జోన్ వద్దని సీపీఎం జిల్లా కార్యదర్శి కొల్లి గంగునాయుడు పేర్కొన్నారు. ఈ మేరకు సీతానగరం మండలంలోని అప్పయ్యపేట, జోగింపేట,గుచ్చిమి రేపటివలస గ్రామాల మధ్య ఉన్న కొండవద్ద గురువారం ఆయన మాట్లాడుతూ మండలంలో ఏనుగుల జోన్ పెట్టడం అంటే ఏనుగులను ఎక్కడి నుంచి వచ్చాయో అక్కడికి తరలించలేని నిస్సహాయ స్థితిలో ప్రభుత్వం ఉందన్నారు. అప్పయ్యపేట, రేపటివలస సరిహద్దుల్లో ఏనుగుల జోన్ పేరుతో ఫారెస్టు అధికారులు చేపట్టిన కందకాల తవ్వకం పనులను నిలుపుదల చేయాలని కోరారు. జనావాసాల మధ్య ఏనుగుల జోన్ ఏర్పాటు చేస్తే మన్యం జిల్లాలో జనం బతకలేరన్నారు. అధికారుల నిర్ణయాన్ని పునరాలోచన చేయాలని సూచించారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు రెడ్డి వేణు, రెడ్డి ఈశ్వరరావు, గవర వెంకటరమణ, ఆర్.రాము, వై.రామారావు, కె.అప్పారావు, వై.రాంబాబు, పరమేశు తదితరులు పాల్గొన్నారు.