
కాంస్య పతకం చూపిస్తున్న వెయిట్ లిఫ్టర్ మణికంఠ
నెల్లిమర్ల రూరల్/విజయనగరం టౌన్: ఉత్తరప్రదేశ్లోని నోయిడా వేదికగా జరుగుతున్న జాతీయస్థాయి ఖేలో ఇండియా యూనివర్సిటీ క్రీడల్లో జిల్లాకు మరో పతకం లభించింది. నెల్లిమర్ల మండలంలోని చంద్రంపేట గ్రామానికి చెందిన వెయిట్ లిఫ్టర్ మొయిద మణికంఠ కాంస్య పతకం సాధించాడు. 89 కేజీల విభాగంలో శుక్రవారం జరిగిన పోటీల్లో పాల్గొన్న మణికంఠ స్నాచ్ 130 కిలోలు, క్లీన్ అండ్ జెర్క్ 154 కిలోల చొప్పున బరువు ఎత్తి పతకం సాధించాడు. మణికంఠకు జిల్లా వెయిట్ లిఫ్టింగ్ అసోషియేషన్ ప్రతినిధులు, గ్రామస్తులు అభినందనలు తెలిపారు. విజయనగరంలోని సత్య డిగ్రీ, పీజీ కళాశాలలో చదువుతున్న మణికంఠను కళాశాల కార్యదర్శి, కరస్పాండెంట్ డాక్టర్ ఝాన్సీలక్ష్మి, ప్రిన్సిపాల్ డాక్టర్ ఎమ్వీ సాయిదేవమణి, ఫిజికల్ డైరెక్టర్ మహేష్ తదితరులు అభినందించారు.