ఆర్టీసీ బస్సు ఢీకొని మహిళ మృతి
దుర్గి: ఆర్టీసీ బస్సు ఢీకొనటంతో మహిళ మృతి చెందిన ఘటన మండల పరిధిలోని ముటుకూరు గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. శిరిగిరిపాడు నుంచి నరసరావుపేట వెళ్తున్న బస్సు ముటుకూరు బస్టాండ్ వద్దకు రాగానే మిరియాల లక్ష్మి (30) బస్సు ఎక్కేందుకు ముందుకొచ్చింది. అకస్మాత్తుగా డ్రైవర్ బస్సు కదిలించటంతో తగిలి అక్కడికక్కడే మృతి చెందింది. విషయం తెలుసుకున్న పోలీసులు భర్త అంకారావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మాచర్ల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు.
ఆర్టీసీ బస్టాండ్లను పరిశుభ్రంగా తీర్చిదిద్దాలి
ఆర్టీసీ నెల్లూరు జోనల్ చైర్మన్ సురేష్ రెడ్డి
సత్తెనపల్లి: రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ బస్టాండ్లను పరిశుభ్రంగా తీర్చిదిద్దుకోవాలని ఆర్టీసీ నెల్లూరు జోనల్ చైర్మన్ సన్నపురెడ్డి సురేష్రెడ్డి అన్నారు. స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్రలో భాగంగా పల్నాడు జిల్లా సత్తెనపల్లి ఆర్టీసీ బస్టాండ్లో వాషింగ్, స్వీపింగ్ కార్మికులకు స్వచ్ఛ పరికరాల పంపిణీ కార్యక్రమంలో ఆదివారం ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లా డారు. ఈ సందర్భంగా సురేష్రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం సీ్త్ర శక్తి పథకాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తుందన్నారు. ప్రయాణికులకు అన్నివిధాల మెరుగైన సౌకర్యాలు కల్పనకు ఆర్టీసీ బస్టాండ్లో వసతులు కల్పించడం జరుగు తుందన్నారు. కార్మికులకు స్వచ్ఛ పరికరాలను పంపిణీ చేశారు. ఆర్టీసీ జోనల్ చైర్మన్ సురేష్రెడ్డిని ఆర్టీసీ కాంట్రాక్టర్ యెల్లినేడి శ్రీనివాస్ మెమంటోతో సత్కరించారు. పల్నాడు జిల్లా డీపీటీఓ అజితకుమారి, డిపో మేనేజర్ జీఎస్వీవీ కుమార్, ఎన్ఎంయుఏ సెక్రటరీ ఎన్.నాగేశ్వరరావు, ఎంప్లాయిస్ యూనియన్ సెక్రటరీ బి.యల్లమంద, కార్మికులు, ఆర్టీసీ ఉద్యోగులు ఉన్నారు.
సైబర్ మోసానికి గురైన గుడిపూడి వాసి
సత్తెనపల్లి: సైబర్ మోసానికి పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం గుడిపూడి వాసి గురయ్యాడు. వివరాలు ఇలా ఉన్నాయి.. గుడిపూడి గ్రామానికి చెందిన బండారుపల్లి పిచ్చియ్య పెద్ద కుమారుడు అమెరికాలో ఉద్యోగం చేస్తున్నాడు. ఈక్రమంలో గుర్తు తెలియని వ్యక్తి ఈ నెల 20న మధ్యాహ్నం సమయంలో బండారుపల్లి పిచ్చియ్యకు ఫోన్ చేసి మీ కుమారుడు డ్రగ్స్ కేసులో ఇరుక్కున్నాడు, రూ.లక్ష చెల్లించక పోతే వెంటనే అరెస్టు చేస్తామన్నాడు. దీంతో భయపడి పోయిన పిచ్చియ్య అసలు ఏం జరిగిందని అడిగేలోపే తన ఫోన్పే నెంబర్ చెప్పాడు. దీంతో కంగారు పడిన పిచ్చియ్య రూ. లక్ష ఫోన్ పే ద్వారా చెల్లించాడు. కొద్దిసేపటి తర్వాత పిచ్చియ్య తన పెద్ద కుమారుడికి ఫోన్ చేయగా తాను డ్రగ్స్ కేసులో ఇరుక్కోవడం ఏంటని ప్రశ్నించాడు. దీంతో మోసపోయినట్టు గ్రహించిన పిచ్చియ్య సత్తెనపల్లిరూరల్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు.
ఆర్టీసీ బస్సు ఢీకొని మహిళ మృతి
ఆర్టీసీ బస్సు ఢీకొని మహిళ మృతి


