భక్తులకు సౌకర్యాలు కల్పించండి
నరసరావుపేట: కార్తిక మాసంలో ఆలయాలకు వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలు అందించాలని జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా అధికారులను ఆదేశించారు. కార్తికమాసం సందర్భంగా గురువారం కలెక్టరేట్లో జిల్లాలోని ఆలయాల్లో జరుగుతున్న ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించా రు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని కోటప్పకొండ, అమరావతి, దైద, చేజర్ల వంటి ఆలయాలకు భక్తులు అధిక సంఖ్యలో తరలి రానున్న దృష్ట్యా ఐదు దేవాలయాలపై ప్రత్యేక దృష్టి సారించాలని అన్నారు. జిల్లాలోని మిగిలిన దేవాలయాల్లో కూడా తగిన ఏర్పాట్లు చేయాలన్నారు. పెద్ద ఆలయాలకు భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటున్నందున తగిన జాగ్రతలు తీసుకోవాలని సూచించారు. భక్తులు ఆలయాల సందర్శన, రాకపోకలు, అన్నదానం, ప్రసాదం, దర్శనం, తాగునీరు, పారిశుద్ధ్యం, ప్రతి ఆలయంలో మెడికల్ క్యాంపుల ఏర్పాటు, ప్రతి ఆలయానికి బస్సు సౌకర్యం కల్పించటం, నిరంతర విద్యుత్తు ఉండేలా చూడటం, సీసీ కెమెరాల ఏర్పాటు, వర్షాలను తట్టుకునేలా టెంట్లు ఏర్పాటు చేసి భక్తులకు ఇబ్బంది కలుగకుండా చూడాలని ఆదేశించారు. నదుల వెంట ఉన్న ఆలయాలకు భద్రత పెంచేందుకు తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు. జిల్లా ఎస్పీ బి.కృష్ణారావు మాట్లాడుతూ వాహనాల పార్కింగ్ ఏర్పాట్లు పటిష్టంగా చేయాలన్నారు. ట్రాఫిక్ నియంత్రణ, భక్తుల రద్దీ నియంత్రణ కోసం ప్రత్యేక క్యూలైన్లు, సైన్ బోర్డులు ఏర్పాటుచేయాలన్నారు. డీఆర్ఓ ఏకా మురళి, అటవీ శాఖ అధికారిని కృష్ణప్రియ, దేవాదాయశాఖ అధికారులు, ఆర్డీవోలు, ఆర్టీసీ, ఆర్ అండ్ బీ, డీఎస్పీలు, ఈవోలు పాల్గొన్నారు.
ఆరోగ్య కేంద్రాల్లో నిత్యం వైద్య సేవలు
జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో 24 గంటలూ వైద్య సేవలు అందించేందుకు సిబ్బంది అందుబాటులో ఉండాలని జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా ఆదేశించారు. గురువారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో వైద్య, ఆరోగ్యశాఖపై సమీక్ష సమావేశం నిర్వహించారు. షిఫ్టుల వారీగా విధులు కేటాయించి స్టాఫ్నర్సులు అన్ని వేళలా విధుల్లో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. మెడికల్ ఆఫీసర్లు, కొరత ఉన్న ఇతర సిబ్బంది నియామక ప్రక్రియ చేపట్టాలన్నారు. డీఎంహెచ్ఓ డాక్టర్ బి.రవి, డిప్యూటీ డీఎంహెచ్ఓ పద్మావతి, డీసీహెచ్ఎస్ ప్రసూన పాల్గొన్నారు.


