తెల్లబోయిన బంగారం
పెరిగిన పెట్టుబడి..తగ్గిన దిగుబడి
ఎకరాకు ఐదారు క్వింటాళ్లకు మించి రాని పత్తి
వర్షాలకు అధికమవుతున్న తేమశాతం
జిల్లాలో 2,27,180 ఎకరాల్లో పత్తి సాగు
కేంద్రం మద్దతు ధర రూ.8,110
రైతుకు దక్కుతున్నది రూ.6,500
సీసీఐ కేంద్రాలు ఏర్పాటులో ఆలస్యం
రైతులను దోచుకుంటున్న దళారులు
సాక్షి, నరసరావుపేట: తెల్ల బంగారంగా పిలిచే పత్తిసాగుకు పల్నాడు పెట్టింది పేరు. రెండు మూడేళ్లుగా చీడ పీడలు, దిగుబడులు తగ్గడంతో రైతులు తీవ్రంగా నష్టపోవడంతో పత్తి సాగుకు రైతులు వెనకాడారు. మారిన పరిస్థితుల నేపథ్యంలో ఈ ఏడాది పత్తి సాగు భారీగా పెరిగింది. జిల్లా వ్యాప్తంగా ఏకంగా 2,27,180 ఎకరాల్లో పత్తి సాగైంది. పత్తికి పునర్వైభవం వచ్చిందనుకునేలోపు వర్షాభా వం ఆ తరువాత అధిక వర్షాలు రైతులను నిండా ముంచుతున్నాయి. మరోవైపు తెగుళ్లు సోకడంతో పెట్టుబడి పెరిగి, దిగుబడి తగ్గింది. ఓవైపు వర్షా లు ఆగకపోవడం మరోవైపు పత్తిలో తేమ శాతం పెరుగుతుండటం రైతుల్లో గుబులు పుట్టిస్తోంది. ప్రభు త్వం సీసీఐ కేంద్రాల ద్వారా పత్తి కొనుగోళ్లు ప్రా రంభించకపోవడంతో ఇదే అదనుగా భావిస్తు న్న దళారులు రైతుల నుంచి తక్కువ ధరకే పత్తి కొనుగోలు చేస్తున్నారు. ప్రభుత్వం వెంటనే సీసీఐ కేంద్రాలను ఏర్పాటు చేసి కొనుగోళ్లు ప్రారంభించకపోతే రైతులు మరింత నష్టపోయే ప్రమాదముంది.
వరుస వర్షాలతో చేటు
జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది వర్షపాతం అధికంగా నమోదైంది. దీంతో పంటను ఎర్ర తెగులు ఆశించింది. తెగులు నివారణకు రైతులు మందులు అధికంగా పిచికారి చేయాల్సి వచ్చింది. పొలాల్లో వర్షం నీళ్లు ఈ సీజన్లో ఎక్కువ రోజులు నీరు నిల్వ ఉండటంతో చేలు ఉరకెత్తాయి. పూత, పిందెలు రాలిపోతున్నాయి. ఎకరాకు 15 నుంచి 20 క్వింటాళ్లు రావాల్సిన దిగుబడి ఐదారు క్వింటాళ్లకే పరిమితమైంది. మరోవైపు కౌలు రైతులకు పెట్టుబడి రూ.60 వేల దాకా అవుతోంది. పెట్టుబడి, వర్షాల వల్ల ఓ వైపు పెట్టుబడి పెరగడం, మరోవైపు దిగుబడి తగ్గడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు.
దక్కని మద్దతు
కేంద్ర పత్తికి ప్రకటించిన క్వింటాల్ మద్దతు ధర రూ.8,110 దక్కినా కొంత నష్టాల నుంచి బయటపడొచ్చని ఆశించిన రైతులకు నిరాశే మిగులుతోంది. సీసీఐ కేంద్రాల ద్వారా పత్తి కొనుగోళ్లు ఇంకా ప్రారంభం కాకపోవడంతో దళారులు రైతులను నిండా ముంచుతున్నారు. వర్షం ఎక్కువగా కురవడం పత్తికి శాపంగా మారింది. నెమ్ము ఎక్కవగా ఉందని ధర తగ్గించి కొనుగోలు చేస్తున్నారు. రైతులకు పత్తిని నిల్వ చేసుకొనే అవకాశం లేకపోవడంతో తీసిన పత్తిని తీసినట్టు అమ్మాల్సిన పరిస్థితి నెలకొంది. నాణ్యమైన పత్తి క్వింటాల్ రూ.5 వేలకు, గుడ్డి పత్తి క్వింటాల్ రూ.3వేలు నుంచి రూ.4 వేలకు కొనుగోలు చేస్తున్నారు. రైతులకు కనీసం పెట్టుబడి రాకపోగా అప్పులపాలవుతున్నారు. ప్రభుత్వం స్పందించి సీసీఐ కేంద్రాలు త్వరగా తెరిస్తే రైతులకు కొంతమేర మేలు జరుగుతుంది.


