
కొనలేక పొగ !
యడ్లపాడు: మార్క్ఫెడ్ ద్వారా నల్లబర్లీ పొగాకును కొనేందుకు జిల్లాలో మైదవోలు – వంకాయలపాడు పరిధిలోని స్పైసెస్ పార్కులో ఈనెల 20న జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా కొనుగోలు కేంద్రం ప్రారంభమైంది. అయితే, ఈ ప్రక్రియలో కొన్ని లోపాలు, అక్రమాలు జరుగుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తేమశాతం ఉండరాదని, చెక్కులో ఏఒక్క ఆకు, సూర చేర్చరాదని, ఇంటివద్దే పొగాకు గ్రేడింగ్ చేయాలని, రైతుసేవా కేంద్రంలో నమోదై ఉండాలని, సీఎం యాప్లో రిజిస్ట్రేషన్ విధిగా చేసుకోవాలని, షెడ్యుల్ ప్రకారంగా మొబైల్ కు సందేశం వచ్చిన రోజే రైతు తమ ఉత్పత్తులను తేవాలని ఆంక్షలు విధించడం రైతులను ఆదుకోవడమేనా అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కొనేసరికి ఖరీఫ్ ముగిస్తే..!
అధికారిక లెక్కల ప్రకారం...జిల్లాలో 8900 మంది రైతులు 99వేల క్వింటాళ్ల పొగాకు సాగు చేశారని చెబుతున్నా, నమోదు చేసుకోనివారు ఇంకా ఉన్నారు. కంపెనీలు, వ్యాపారులకు వీరివద్ద సగం పొగాకును కొనుగోలు చేసినట్లు వ్యవసాయ అధికారులు వెల్లడిస్తున్నారు. రోజుకు 200 క్వింటాళ్లకు మించి కొనుగోలు చేయడం సాధ్యం కాదని కేంద్రం ప్రారంభ సభలోనే అధికారులు స్పష్టం చేశారు. మరి మిగిలిన సగం కొనుగోళ్లకు పట్టే కాలంలో ఖరీఫ్ సీజన్ ముగిసి పోతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మూడో ధరపై అయోమయం
కేంద్రంలో ప్రస్తుతం పొగాకు నాణ్యత ఆధారంగా రూ.6వేలు (నాసిరకం), రూ.9వేలు (మధ్యస్థం), రూ.12వేలు (ఉత్తమ నాణ్యత)గా ధరలు నిర్ణయించి కొనుగోలు చేస్తున్నారు. జిల్లా కలెక్టర్ సైతం మొదట రెండు రకాల ధరలను ప్రకటించి, ఆ తరువాత మూడో ధరను తెరపైకి తీసుకురావడంలో ఆంతర్యమేమిటంటూ రైతులు ప్రశ్నిస్తున్నారు. కేంద్రానికి తెచ్చిన పొగాకులో అత్యధికంగా రూ.9వేల ధరకే కొనుగోలు చేస్తున్నారంటూ రైతులు చెబుతున్నారు. ఇప్పటి వరకు రూ.9వేలకు కొనుగోలు చేసిన చెక్కులను రూ.12వేలకు మార్పు చేయాలని, అప్పుడే తమ పెట్టుబడి నష్టం పోకుండా, అప్పుల నుంచి కొంత ఊరట లభిస్తుందని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
‘పచ్చ’పాతంపై అభ్యంతరం
సీఎం యాప్లో రిజిస్ట్రేషన్ చేసిన వారికే ఎంపికై న తేదీలో పొగాకు కొనుగోలు జరుగుతుందని ప్రకటించిన అధికారులు, మెసేజ్లు రాకపోయినా కొందరి బేళ్లను కొనుగోలు చేస్తుండడంపై రైతులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. మెసేజ్ లు రాకమునుపే కేంద్రంలో నాలుగు రోజులు 183 క్వింటాళ్ల కొనుగోళ్లు ఎలా జరిగాయని ప్రశ్నిస్తున్నారు. స్థానిక టీడీపీ ముఖ్యనేత సిఫార్సుతో వ్యాపారులకు మేలు చేస్తున్న అధికారుల తీరుతో, వాస్తవ రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రహసనంలా నల్లబర్లీ కొనుగోలు ప్రక్రియ
రకరకాల ఆంక్షలు.. అక్రమాలు సందేశాలు రాకుండానే కొందరికి చెక్కులు.. కొనుగోళ్లు రెండే ధరలన్న ప్రభుత్వం.. మూడో ధర ప్రకటించడంపై అనుమానం మొత్తం కొనేలోపు ఖరీఫ్ దాటుతుందని రైతుల ఆందోళన