
ఆయిల్ పామ్ సాగుకు ప్రోత్సాహం
అమరావతి(అచ్చంపేట): జిల్లాలో ఆయిల్పామ్ సాగు చేసేందుకు 8 మండలాలను ఎంపిక చేసినట్లు జిల్లా ఉద్యానశాఖాధికారి ఐ.వెంకట్రావు తెలిపారు. మండలంలోని మాల్లాదిలో గురువారం ఉద్యానశాఖ, వ్యాల్యూ ఆయిల్ అండ్ గ్యాస్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ సంయుక్త సహకారంతో ఆయిల్ పామ్ మెగా ప్లాంటేషన్పై అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా ఉద్యానశాఖాధికారి మాట్లాడుతూ అమరావతి మండలంలోని మల్లాదిలో 10 ఎకరాల విస్తీర్ణంలో ఆయిల్పామ్ సాగు చేపట్టడం జరిగిందన్నారు. రైతులకు ఒక హెక్టార్కి 150 మొక్కలు చొప్పున విదేశీ మొక్కలకు ఒక్కొక్క మొక్కకు రూ.193, దేశీయ మొక్కకు రూ.133 చొప్పున రూ.29,000 రాయితీ ఇవ్వనున్నట్లు చెప్పారు. సాగు ప్రోత్సాహంలో భాగంగా హెక్టారుకు 50శాతం రాయితీపై నాలుగు సంవత్సరాలకు రూ.21000లకు మించకుండా రాయితీ ఇవ్వనున్నామన్నారు. అమరావతి మండలం ఆయిల్ పామ్ సాగుకు అనుకూలంగా ఉంటుందని వాల్యూ ఆయిల్ అండ్ గ్యాస్ లిమిటెడ్ ఏరియా మేనేజర్ యం.నవీన్ తెలిపారు. నియోజకవర్గ ఉద్యానశాఖాధికారి ఎన్.సురేష్, డ్రిప్ ఇరిగేషన్ ఎంఐఏఓ మోషే నాయక్, గ్రామ ఉద్యానవన అసిస్టెంట్లు, వ్యవసాయ అసిస్టెంట్లు, రైతులు పాల్గొన్నారు.
జిల్లా ఉద్యానశాఖాధికారి వెంకట్రావు