
యడ్లపాడులో పట్టపగలు దారుణం
● జాతీయ రహదారి పక్కన యువకుడి మృతదేహాన్ని తగులబెట్టిన దుండగులు ● గుర్తించి మంటలు ఆర్పిన హైవే పెట్రోలింగ్ సిబ్బంది
యడ్లపాడు: యడ్లపాడులో అత్యంత దారుణమైన, హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. నిత్యం వాహనాలతో కిటకిటలాడే జాతీయ రహదారి పక్కనే, పట్టపగలు ఓ యువకుడిని ఫ్లెక్సీలో చుట్టి నిప్పుపెట్టిన ఘటన బుధవారం కలకలం రేపింది. యడ్లపాడులోని 16వ నంబర్ జాతీయ రహదారి, సర్వీస్ మార్గం మధ్యలో ఉన్న మురుగు కాల్వలో గుర్తుతెలియని దుండగులు ఓ యువకుడి మృతదేహాన్ని ఫ్లెక్సీలో చుట్టి పడేసి నిప్పంటించారు. సరిగ్గా ఉదయం 8:30 గంటల సమయంలో హైవే పెట్రోలింగ్ సిబ్బంది ఆ వైపుగా వెళ్తుండగా, కాల్వలోంచి మంటలు ఎగసిపడటం చూసి అనుమానంతో దగ్గరకు వెళ్లారు. మంటల్లో మనిషి శరీరం కాలిపోతుండటం చూసి షాక్కు గురయ్యారు. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది, తమ కారులోని వాటర్ క్యాన్తో మంటలను ఆర్పేశారు. కానీ, అప్పటికే దుండగుల దారుణానికి ఆ యువకుడి ముఖం తప్ప దేహం అంతా పూర్తిగా కాలిబూడిదైపోయింది.
● సమాచారం అందిన వెంటనే నరసరావుపేట డీఎస్పీ కె.నాగేశ్వర్, చిలకలూరిపేట రూరల్ సీఐ బి.సుబ్బానాయుడు, యడ్లపాడు ఎస్ఐ టి.శివరామకృష్ణలు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. క్లూస్ టీం, డాగ్స్వాడ్ను రప్పించి ఘటనా స్థలంలో వేలిముద్రలు, ఇతర కీలక ఆధారాలను సేకరించారు. అనంతరం, మృతదేహాన్ని ఫోరెన్సిక్, పోస్టుమార్టం నిమిత్తం చిలకలూరిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
స్థానికంగా కలకలం
పట్టపగలు, అత్యంత రద్దీగా ఉండే ప్రాంతంలో ఇలాంటి దారుణం జరగడం నియోజకవర్గంలో కలకలం రేపింది. ఈ ఘటన స్థానికులతో పాటు పోలీసులను కూడా దిగ్భ్రాంతికి గురిచేసింది. అసలు ఈ యువకుడు ఎవరు? ఎక్కడివాడు? దుండగులు అతడిని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు? హత్యకు గల కారణాలు ఏంటి? ఇది ముమ్మాటికీ హత్యే అయితే, ఎక్కడ చేసి ఇక్కడకు తెచ్చారు? పట్టపగలే నిప్పంటించేంత తెగించి ఎందుకు ఈ దారుణానికి ఒడిగట్టారు? వంటి అనేక ప్రశ్నలు ప్రస్తుతం పోలీసులకు సవాలుగా మారాయి. మృతుడి ఆచూకీ కోసం సంఘటన స్థలం వద్ద తీసిన చిత్రాలను అన్ని పోలీస్ స్టేషన్లకు పంపించినట్లు సమాచారం. నరసరావుపేట డీఎస్పీ నాగేశ్వర్ పర్యవేక్షణలో పోలీసులు పోలీసులు రెండు బృందాలుగా ఏర్పడి ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు పోలీసుల విచారణలో వెల్లడి కావాల్సి ఉంది.

యడ్లపాడులో పట్టపగలు దారుణం