
కూటమి ప్రభుత్వంలో ఆశాభంగం
నరసరావుపేట: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తమ వేతనాలు పెరుగుతాయని, అర్హులకు పదోన్నతులు ఇస్తారని ఆశించి వీఆర్ఏలు భంగపడ్డారని, ఏ ఒక్క సమస్యా పరిష్కరించలేదని ఏపీ గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం (సీఐటీయూ) జిల్లా అధ్యక్షుడు షేక్ బందగీసాహెబ్ అన్నారు. రెవెన్యూ వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్న గ్రామ రెవెన్యూ సహాయకుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ పల్నాడు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో బుధవారం కలెక్టరేట్ ఎదుట నిరసన చేపట్టారు. బందగీసాహెబ్ మాట్లాడుతూ సమస్యలు పరిష్కారం కోసం తమ సంఘం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు కలెక్టరేట్ ఎదుట నిరసన చేపట్టామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 20వేలమంది గ్రామ రెవెన్యూ సహాయకులుగా సుదీర్ఘ కాలం నుంచి తక్కువ వేతనంతో దిగువ స్థాయిలో పనిచేస్తూ రెవెన్యూ పరమైన సమస్యల పరిష్కారంలో కీలక పాత్ర పోషిస్తున్నామన్నారు. రీ సర్వే పేరుతో ఇతర ప్రాంతాలకు వెళ్లి పనిచేయాల్సి వస్తుందని, పనిభారం పెంచి టీఏ, డీఏలు ఇవ్వకపోవడంతో ఆర్థిక సమస్యలు తోడయ్యాయన్నారు. సమస్యలు పరిష్కరించకపోతే రానున్న రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేపడతామన్నారు. అనంతరం డీఆర్ఓ ఏకామురళి, అదే సమయానికి అక్కడకు వచ్చిన నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబుకు వినతిపత్రం అందజేశారు. సత్తెనపల్లి డివిజన్ అధ్యక్ష, కార్యదర్శులు సంజీవరావు, సుబ్బారావు, నరసరావుపేట డివిజన్ అధ్యక్షుడు ఆనంద్ కుమార్, సీనియర్ నాయకులు పౌలేష్, మండల అధ్యక్ష, కార్యదర్శులు, నాయకులు పాల్గొన్నారు.
సమస్యలు పరిష్కరించకుంటే రాష్ట్రవ్యాప్త ఉద్యమం
కలెక్టరేట్ ఎదుట గ్రామ రెవెన్యూ సహాయకుల నిరసన
డీఆర్ఓకు వినతిపత్రం అందజేత