
భార్యపై అనుమానంతో వ్యక్తి హత్య
భట్టిప్రోలు(వేమూరు): భార్యపై అనుమానంతో ఓ వ్యక్తిని కత్తితో నరికి హత్య చేసిన ఘటన సోమవారం రాత్రి భట్టిప్రోలులో చోటుచేసుకుంది. వేమూరు రూరల్ సీఐ వీరాంజనేయులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. వేమూరు మండలం జంపని గ్రామానికి చెందిన చాగళ్లమర్రి రత్నరాజు, జంపని సురేష్ స్నేహితులు. రత్నరాజు తాపీ పనిచేస్తుండగా, సురేష్ వడ్రంగి పనిచేస్తున్నాడు. రత్నరాజు భట్టిప్రోలు గ్రామానికి చెందిన యువతిని ప్రేమించి వివాహం చేసుకున్నాడు. భార్యాభర్తలు గొడవపడడంతో ఆమె భట్టిప్రోలులోని పుట్టింటికి వచ్చి ఉంటుంది. ఈనేపథ్యంలో సోమవారం రాత్రి రత్నరాజు భట్టిప్రోలు వచ్చాడు. స్థానిక బస్టాండ్ సెంటర్లో జంపని గ్రామానికి చెందిన జంపని సురేష్ తారసపడ్డాడు. దీంతో రత్నరాజు అతనిని ఇక్కడకు ఎందుకు వచ్చావ్ అని ప్రశ్నించాడు. ఇరువురి మధ్య ఘర్షణ జరిగింది. రత్నరాజు తన చేతిలో ఉన్న కత్తితో సురేష్ను పొడిచి హత్య చేశాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రేపల్లె ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అందజేశారు.