అమరావతి (పెదకూరపాడు): అమరావతిలోని అమరేశ్వరస్వామి దేవాలయానికి సంబంధించి ముప్పాళ్ళ మండలం మాదల, దమ్మాలపాడు గ్రామాల్లోని సుమారు 70 ఎకరాల భూములను బహిరంగ వేలం వేయగా, గత ఏడాది కంటే రూ.8,14,500 ఆదాయం వచ్చినట్లు ఆలయ కార్యనిర్వహణ కార్యదర్శి రేఖ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. 2022–23, 2024–25 కాలానికి గతంలో రూ. 6,13,000 ఆదాయం వచ్చిందని తెలిపారు. ప్రస్తుతం 2025–26, 2026–27 సంవత్సరాలకు రూ.14,27,500 ఆదాయం సమకూరిందన్నారు. గతంతో పోల్చుకుంటే రూ. 8,14,500 ఆదాయం వచ్చిందని ఆమె తెలిపారు.
పులిచింతల వద్ద మొసళ్లు
అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టు జలాశయంలోనే కాదు. ఇటీవల కాలంలో ప్రాజెక్టు మీదకు కూడా మొసళ్లు వస్తున్నాయి. ఈ ప్రాంతం రెండు తెలుగు రాష్ట్రాల సరిహద్దు కావడంతో రాకపోకలు కొనసాగించాలంటే ప్రాజెక్టు మీద నుంచే వెళ్లాలి. కొంత మంది ప్రాజెక్టు మీదుగా నడిచి కూడా వెళుతున్నారు. ఏమాత్రం అప్రమత్తంగా లేకున్నా మొసళ్లతో ముప్పు పొంచి ఉందన్న విషయాన్ని వాహనారులు, పాదచారులు గుర్తుంచుకోవాలి.
ఆలయ నిర్మాణానికి విరాళం
నరసరావుపేట రూరల్: ఇస్సప్పాలెం మహంకాళి అమ్మవారి ఆలయ నిర్మాణానికి నరసరావుపేటకు చెందిన వేమ వెంకటేశ్వరరావు, నాగ రజిని దంపతులు రూ.లక్ష విరాళం అందజేశారు. ఆలయ ఈవో నలబోతు మాధవిదేవిని మంగళవారం ఆలయ కార్యాలయంలో కలిసిన దాతలు విరాళం మొత్తాన్ని అందించారు. ఆలయ నిర్మాణానికి దాతలు సహకరించాలని ఈ సందర్భంగా ఈవో కోరారు. కార్యక్రమంలో ఆలయ అర్చకులు కొత్తలంక కార్తికేయ శర్మ, నండూరి కాళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
ఐషర్ లారీలో మంటలు
నరసరావుపేట రూరల్: షార్ట్ సర్కూట్తో మంటలు చేలరేగి ఓ లారీ దగ్ధమైన ఘటన కోటప్పకొండ సమీపంలో మంగళవారం చోటుచేసుకుంది. అగ్నిమాపక సిబ్బంది తెలిపిన వివరాలు... బొప్పాయి లోడ్ కోసం పశ్చిమబెంగాల్ నుంచి ఐషర్ వాహనం కోటప్పకొండకు వచ్చింది. లారీని రోడ్డు పక్కన నిలిపి డ్రైవర్, క్లీనర్ టిఫిన్ చేస్తుండగా ఇంజన్ నుంచి మంటలు చెలరేగాయి. సమీపంలోని వారు గమనించి మంటలను అదుపుచేసేందుకు ప్రయత్నించారు. అప్పటికే ఇంజన్, క్యాబిన్కు మంటలు అలుముకున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఘటనా స్థలాన్ని జిల్లా అగ్నిమాపక అధికారి శ్రీధర్ పరిశీలించారు.
భక్తి శ్రద్ధలతో చండీహోమం
నగరంపాలెం(గుంటూరు వెస్ట్): గుంటూరు బృందావన్గార్డెన్స్లోని వేంకటేశ్వరస్వామి ఆలయ ధార్మిక ప్రాంగణంలో మంగళవారం రాత్రి భక్తిశ్రద్ధలతో చండీహోమం నిర్వహించా రు. భారతీ ధార్మిక విజ్ఞాన పరిషత్ ఆధ్వర్యంలో విశ్వశాంతిని కాంక్షిస్తూ హోమం చేపట్టారు. బొల్లేపల్లి సత్యనారాయణ, లలితాంబ దంపతులతో తొమ్మిది మంది వేదపండితుల నిర్వహణలో గణపతికి, శివలింగానికి, నవగ్రహాలకు విశేష అభిషేకాలు, అర్చనలు, రుద్ర, లక్ష్మీగణపతి, చండీ హోమాలు నిర్వహించి పూర్ణా హుతి చేశారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు సిహెచ్.మస్తానయ్య, ఉపాధ్యక్షులు లంకా విజయబాబు, ప్రధాన కార్యదర్శి బొర్రా ఉమామహేశ్వరరావు, సహాయ కార్యదర్శులు ఊటుకూరి నాగేశ్వరరావు, పుట్టగుంట ప్రభాకరరావు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
సాగర్ నీటిమట్టం
విజయపురిసౌత్: నాగార్జునసాగర్ జలాశయ నీటిమట్టం మంగళవారం 514.30 అడుగుల వద్ద ఉంది. ఇది 139.0872 టీఎంసీలకు సమానం.

అమరేశ్వర స్వామికి ఆదాయం

భక్తి శ్రద్ధలతో చండీహోమం