
పౌడా సమావేశంలో 15 అంశాలు ఏకగ్రీవ ఆమోదం
నరసరావుపేట: స్థానిక కలెక్టర్ కార్యాలయంలోని జేసీ చాంబర్లో జాయింట్ కలెక్టర్ సూరజ్ గనోరే అధ్యక్షతన మంగళవారం పల్నాడు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (పౌడా) కమిటీ సాధారణ సమావేశం నిర్వహించారు. దీనికి హాజరైన అధికారులు అజెండాలో ప్రభుత్వం విడుదల చేసిన 15 అంశాలపై చర్చించి ఏకగ్రీవంగా ఆమోదించారు. పౌడా అభివృద్ధికి చేయాల్సిన అంశాలపై చర్చించారు. సమావేశంలో టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ రీజినల్ డెప్యూటీ డైరెక్టర్ పి.మధుకుమార్, ఆర్అండ్బీ సూపరింటెండెంట్ ఇంజినీర్ రాజానాయక్, విద్యుత్శాఖ ఎగ్జిక్యూటీవ్ ఇంజినీర్ సీహెచ్.రాంబొట్లు, పర్యాటక శాఖ జిల్లా అధికారి జి.నాయుడమ్మ, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారి జి.అనీల్కుమార్, పరిశ్రమల శాఖ జిల్లా అధికారి జి.కృష్ణారావు, పౌడా ప్లానింగ్ అధికారి పాల్గొన్నారు.
వాగులో లారీ బోల్తా
ప్రత్తిపాడు: వాగులో లారీ బోల్తా పడిన ఘటన గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం పాతమద్రాసు రోడ్డు వద్ద జరిగింది. స్థానికులు తెలిపిన ప్రకారం.. ప్రకాశం జిల్లా ఉప్పుగుండూరు నుంచి గుంటూరు వైపు ధనియాల లోడుతో వెళుతున్న లారీ మంగళవారం రాత్రి ప్రత్తిపాడు మండలం కోయవారిపాలెం లోలెవల్ చప్టా సమీపంలో కొండవాగులో బోల్తా పడింది. చప్టా ఇరుకుగా ఉండటం, ముందు వెనుకలు ఎలాంటి సైన్బోర్డులూ లేకపోవడంతో ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును తప్పించబోయి మార్జిన్లు అర్థం కాక లారీ వాగులో బోల్తా పడినట్లు తెలుస్తుంది. ప్రమాదంలో ఎవరికి ఎలాంటి ప్రాణాపాయం జరగలేదు.
సీపీవోగా ఏ.షాలెమ్రాజు
బాపట్ల: బాపట్ల జిల్లా ప్రణాళిక అధికారిగా బాధ్యతలు స్వీకరించిన ఏ.షాలెమ్ రాజు జిల్లా కలెక్టర్ జె. వెంకటమురళిని మంగళవారం మర్యాదపూర్వకంగా కలిసి మొక్కను అందించారు. ఇప్పటివరకు ఇక్కడ సీపీఓగా పనిచేసిన కె. శ్రీనివాసరావు విశాఖపట్నం జిల్లాకు బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో సత్యసాయి జిల్లాలో పనిచేస్తున్న షాలెమ్ రాజు నియమితులయ్యారు. ప్రణాళిక శాఖలోని అధికారులు, సిబ్బంది ఆయనకు అభినందనలు తెలిపారు.

పౌడా సమావేశంలో 15 అంశాలు ఏకగ్రీవ ఆమోదం