
పవర్ లిఫ్టింగ్ పోటీల్లో జాతీయస్థాయిలో ప్రథమం
స్వర్ణ, రజత, కాంస్య పతకాలు సాధించిన సత్తెనపల్లి క్రీడాకారుడు
సత్తెనపల్లి: జాతీయ స్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీల్లో పల్నాడు జిల్లా యువకుడు ప్రతిభ చాటాడు. కర్ణాటక రాష్ట్రంలోని దేవనగిరిలో ఈ నెల 22 నుంచి 30 వరకు జాతీయ స్థాయి పవర్ లిఫ్టింగ్ సీనియర్ మెన్, జూనియర్, సబ్ జూనియర్, ఉమెన్ పోటీలు ప్రతిష్టాత్మకంగా జరుగుతున్నాయి. ఈ పోటీల్లో రాష్ట్ర జట్టులో పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం కంకణాలపల్లి గ్రామానికి చెందిన క్రీడాకారుడు ఎన్.శరత్ బంగారు, రజత పతకాలతో ఓవరాల్గా జాతీయ స్థాయిలో ప్రథమ స్థానం సాధించి పల్నాడు జిల్లా ప్రతిష్టను ఇనుమడింప చేశాడు. జాతీయస్థాయి స్క్వాట్లో శరత్ 303 కేజీలు ఎత్తి సరికొత్త జాతీయస్థాయి రికార్డు సృష్టించి, బంగారు పతకం సాధించాడు. డెడ్ లిప్ట్లో రజతం, 74 కిలోల విభాగంలో మొత్తం 723 కిలోలు ఎత్తి కాంస్య పతకం సాధించాడు. జాతీయ స్థాయిలో ప్రతిభ చూపిన క్రీడాకారుడు ఎన్.శరత్ను బుధవారం పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ పల్నాడు జిల్లా సెక్రటరీ పసుపులేటి సురేష్, పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ జిమ్ రాజు, ఎగ్జిక్యూటివ్ మెంబర్ మాతంగి సాంబశివరావు, కత్తి పవన్, మాతంగి రాహుల్ గౌతమ్, జి.రమేష్, శాంతయ్య తదితరులు అభినందించారు.