
సమస్యలు పరిష్కరించకపోతే పోరుబాట
లక్ష్మీపురం: ఏపీ గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం పిలుపులో భాగంగా కలెక్టర్ కార్యాలయం వద్ద బుధవారం వీఆర్ఏలు నిరసన తెలిపారు. అనంతరం డీఆర్వో ఖాజావలికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా గౌరవాధ్యక్షుడు బి.లక్ష్మణరావు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏడాది సుపరిపాలన పేరుతో హామీలు అమలు చేశామంటూ పెద్దఎత్తున సభలు నిర్వహిస్తూ ఉత్సవాలు చేసుకుంటోందని విమర్శించారు. వాటిలో వీఆర్ఏలకు ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా అమలు కాలేదని తెలిపారు. మంత్రి నారా లోకేష్ నాడు నిర్వహించిన యువగళం, పాదయాత్రలో అధికారంలోకి వస్తే తమ ప్రభుత్వం గ్రామ రెవెన్యూ సహాయకులతో సమావేశం జరిపి, సమస్యలు పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఇది నేటికీ అమలు కాలేదని ఆరోపించారు. తెలంగాణ ప్రభుత్వం వీఆర్ఏలకు పే స్కేలు వేతనాలు ఇస్తోందని, ఇక్కడ ప్రభుత్వాలు ఆదిశగా ఎందుకు ఆలోచించట్లేదని ఆయన ప్రశ్నించారు. వీఆర్ఏలకు గతంలో డీఏను వేతనంతో కలిపి ఇచ్చే వాళ్లని, ప్రస్తుతం విడిగా ఇవ్వడంతో పెరుగుదల లేదని పేర్కొన్నారు. గత ఎనిమిది సంవత్సరాల నుంచి వేతనాలు పెంపు లేని కారణంగా వీఆర్ఏలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. వీఆర్ఏలుగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల వారు ఉంటున్నారని, వారి సమస్యల ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఖాళీగా ఉన్న వీఆర్వో, అటెండర్, వాచ్మెన్ పోస్టులను వీఆర్ఏలతో భర్తీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. సమస్యల పరిష్కరించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా వీఆర్ఏలందరినీ ఏకతాటిపై తీసుకొచ్చి పోరాటం చేస్తామని లక్ష్మణరావు వెల్లడించారు. కార్యక్రమంలో నాయకులు బొక్క సాంబశివరావు, షేక్ కరీమున్నిసా, షేక్ ఆదం షఫీ, ఎన్. రామారావు, హనుమంతరావు, ప్రతాప్, పాండు, రాజేష్, రవి, వెంకయ్య పాల్గొన్నారు.
కలెక్టర్ కార్యాలయం వద్ద వీఆర్ఏల నిరసన