
మిర్చి రైతులను గాలికొదిలిన చంద్రబాబు
పిడుగురాళ్ల: కూటమి ప్రభుత్వం చేసేది గోరంత చెప్పేది కొండంత అనే చందగా ఉందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వైద్యుల విభాగం అధికార ప్రతినిధి డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్ తెలిపారు. పట్టణంలోని తన కార్యాలయంలో బుధవారం మాట్లాడుతూ ప్రభుత్వం మిర్చి రైతుల సమస్యలపై అశ్రద్ధ వహిస్తుందన్నారు. మిర్చి సాగుచేసిన రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో క్వింటా సుమారు రూ.25,000 పలికిన మిర్చి ధర కూటమి ప్రభుత్వంలో రూ.6వేలకు పడిపోయిందన్నారు. ఫిబ్రవరిలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గుంటూరు మిర్చి యార్డు పర్యటనతో బెంబేలెత్తిన సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్లు కనీస మద్దతు ధర రూ.11,700 ఉండబోతుందంటూ ఆర్భాటపు ప్రకటన చేశారన్నారు. అంతేకాకుండా అప్పటికే తక్కువ ధరకు అమ్మిన రైతులకు మిగితా డబ్బుని తిరిగి చెల్లించేందుకు కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశామని, అందుకు కేంద్రం సానుకూలంగా స్పందించిందని కూడా చెప్పారన్నారు. అయితే ఇప్పటివరకు మిర్చి రైతులకు ఒక్క రూపాయి కూడా చెల్లించకుండా కూటమి ప్రభుత్వం దగా చేసిందన్నారు. ఆ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని జిల్లాలో మిర్చి రైతులు ప్రస్తుతం మిర్చి వేసేందుకు భయపడుతున్నారన్నారు. అన్నదాత సుఖీభవ పథకం ఈ నెల 20 తేదీలోపు అమలు చేస్తామని ప్రకటించారని, ఇంతవరకు ఎందుకు ఇవ్వలేదని అశోక్కుమార్ ప్రశ్నించారు.