
ప్రభుత్వం దిగొచ్చే వరకూ పోరాటం
గుంటూరు ఎడ్యుకేషన్: సెకండరీ గ్రేడ్ టీచర్ బదిలీల్లో వెబ్ కౌన్సెలింగ్ను రద్దు చేసి మాన్యువల్ విధానంలో నిర్వహించాలని డిమాండ్ చేస్తూ ఉపాధ్యాయులు ఆందోళనను ఉధృతం చేశారు. ఉమ్మడి గుంటూరుజిల్లా ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో సోమవారం జిల్లా కలెక్టరేట్ ఎదుట నాయకులు, ఉపాధ్యాయులు నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా ఐక్యవేదిక ఉమ్మడి గుంటూరు జిల్లా స్టీరింగ్ కమిటీ నాయకుడు కె.బసవలింగారావు మాట్లాడుతూ ఎస్జీటీలకు మాన్యువల్ కౌన్సెలింగ్ నిర్వహిస్తామని హామీ ఇచ్చిన విద్యాశాఖాధికారులు మోసపూరితంగా వెబ్ ఆప్షన్లకు దిగారన్నారు. ఉపాధ్యాయులపై ఒత్తిడి తేవడాన్ని నిరసిస్తూ ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా డీఈవో కార్యాలయాల ముట్టడి ద్వారా ప్రభుత్వానికి నిరసన తెలియజేసినప్పటికీ, ప్రభుత్వంలో చలనం రాలేదని విమర్శించారు. పుండుమీద కారం చల్లినట్లు విద్యాశాఖా మంత్రి లోకేష్ మాన్యువల్ కౌన్సెలింగ్కు చట్టం అడ్డం వస్తుందని చెప్పడం, నమ్మిన ఉపాధ్యాయులను మోసం చేయడమేనని తెలిపారు. జీఓ117 రద్దు, తెలుగు మాధ్యమ పునరుద్ధరణ, పని ఒత్తిడ తగ్గింపుపై ఇచ్చిన మూడు హామీలు అమలు చేయకుండా మోసగించారని ఆరోపించారు. ఐక్యవేదిక నాయకులు ఎం.కళాధర్, డి.పెదబాబు, జీవీ రామకృష్ణ , సోషలిజం మాట్లాడుతూ వెబ్ కౌన్సెలింగ్ వద్దని ఒక పక్క ఉద్యమం చేస్తుంటే మరొక పక్క డీఈఓ, ఎంఈవో కార్యాలయాల నుంచి ఉపాధ్యాయులకు ఫోన్లు చేస్తూ వెబ్ఆప్షన్స్ ఇచ్చుకోవాలాని బెదిరింపులకు దిగడాన్ని తీవ్రంగా ఖండించారు. ఆన్లైన్ వెబ్ ఆప్షన్స్ అనుభవం లేని మహిళా ఉపాధ్యాయులను ఏడిపించడం ఈ ప్రభుత్వానికి, మంత్రికి మంచిది కాదని హితవు పలికారు. వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవద్దని ఉపాధ్యాయులకు పిలుపునిచ్చారు. నిరాహార దీక్ష శిబిరాన్ని సీనియర్ మహిళా నాయకురాలు కుసుకుమారి ప్రారంభించారు. శిబిరంలో ఐక్యవేదిక నాయకులు ఎం.హనుమంతరావు, ఎస్. రామచంద్రయ్య, మహమ్మద్ ఖాలీద్, డీకే సుబ్బారెడ్డి, వినయ్, సంపత్, షకీలా బేగం, జి.దాస్, కె.కృష్ణారావు, సుభాని, ప్రసాద్, సుబ్బారావు పాల్గొన్నారు.
మాన్యువల్ కౌన్సెలింగ్ కోసం ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక పట్టు నిరాహార దీక్ష చేపట్టిన సంఘాల నాయకులు