
మోసగించిన వారిపై చర్యలు తీసుకోండి
నాదెండ్ల: ఓ వివాహిత తనకు జరిగిన మోసం, అన్యాయంపై పల్నాడు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసింది. నాదెండ్ల మండలం ఇర్లపాడు గ్రామానికి చెందిన మంజుభార్గవి బాపట్ల జిల్లా అద్దంకి పట్టణంలో తన నానమ్మ ఇంట్లో ఉంటూ చదువుకుంది. ఆ సమయంలో విశ్వభారతి జూనియర్ కాలేజ్ డైరెక్టర్, తమ దూరపు బంధువు అయిన సోడిశెట్టి రామానాయుడు తనను ప్రేమ పేరిట లోబరుచుకున్నాడని, గర్భిణిని చేశాడని పేర్కొంది. వివాహం చేసుకోమని అడిగితే ముఖం చాటేశాడని, అధికకట్నం తీసుకుని మరో మహిళను పెళ్లి చేసుకునేందుకు సిద్ధపడ్డాడని పేర్కొంది. ఈ విషయపై తాను 2022 ఫిబ్రవరి 8న నరసరావుపేటలోని దిశా పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు తెలిపింది. దీంతో రామానాయుడు తల్లి వెంకటసుబ్బమ్మ, బంధువులైన దుర్గాప్రసాద్, విజయవాడలో ఏఆర్ కానిస్టేబుల్గా పనిచేస్తున్న మేకల నరేంద్ర తనతో మాట్లాడి రామానాయుడితో వివాహం జరిపిస్తామన్నారు.
● అయితే కొన్ని రోజుల తర్వాత రామానాయుడు సోదరుడు కామేశ్వరరావును వివాహం చేసుకోవాలంటూ వారితో పాటూ ఇతర బంధువులు తనను బలవంతం చేయటంతో అంగీకరించానన్నారు. కామేశ్వరరావుతో తనకు వివాహమైన మూడు రోజుల తర్వాత పదహారు రోజుల పండుగకు వస్తానని చెప్పి కామేశ్వరరావు వెళ్ళిపోయాడని పేర్కొంది. అయితే రామానాయుడు తనకు అసభ్యకరరీతిలో వాట్సాప్లో మెసేజీలు పెట్టేవాడని వాపోయింది. విషయాన్ని కామేశ్వరరావుకు ఫోన్లో చెప్పినా పట్టించుకోలేదని, నీకు తగిన శాస్తి జరిగిందంటూ తిట్టాడని వాపోయింది. 2023 ఏప్రిల్ 27న తన తల్లిదండ్రులు, తమ్ముడితో కలిసి అత్తారింటికి వెళ్లగా, తన అత్త చెప్పాపెట్టకుండా ఇల్లు వదిలి వెళ్లిపోయిందన్నారు. అప్పటి నుంచి తన తల్లితో అద్దంకిలోనే ఉంటున్నానని పేర్కొంది.
● అప్పట్లో తన ఫోన్ తీసుకుని ఏఆర్ కానిస్టేబుల్ నరేంద్ర, దుర్గాప్రసాద్లు తన ఫోన్ను హ్యాక్ చేసి 2023లో తనపై బంధువులకు చెడుగా ప్రచారం చేశారని వాపోయింది. వారు పలుమార్లు తనపై హత్యాయత్నం చేసినట్లు ఫిర్యాదులో పేర్కొంది. తనను మోసగించిన రామానాయుడు, తన భర్త కామేశ్వరరావు, ఏఆర్ కానిస్టేబుల్ నరేంద్ర, దుర్గాప్రసాద్లపై చర్యలు తీసుకొని తనకు న్యాయం చేయాలని కోరింది. ఈ విషయమై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్కల్యాణ్, హోమంత్రి అనిత, మంత్రి నారా లోకేష్లకు ఫిర్యాదు అందించినట్లు తెలిపింది.
జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసిన మహిళ