
సమావేశాలతో మమ అనిపించారు
పట్నంబజారు: గుంటూరు నగరంలో అర్ధరాత్రి పూట మద్యం విక్రయాలపై ‘సాక్షి’లో గురువారం ప్రచురితమైన ‘నిశీధిలోనూ అదే నిషా’ కథనానికి అధికారులు స్పందించారు. బార్ అండ్ రెస్టారెంట్ నిర్వాహకులతో సమావేశం ఏర్పాటు చేసి మద్యం విక్రయాలపై చర్చించారు. అయితే ఇప్పటి వరకు అర్ధరాత్రి పూట మద్యం అమ్మకాలు చేపట్టిన దుకాణాలపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కేవలం కాలక్షేపంగా సమావేశం నిర్వహించి, జాగ్రత్త పడాలంటూ అధికారులే సూచనలు చేశారని విమర్శలు వస్తున్నాయి. స్పష్టంగా సాక్ష్యాధారాలతో ‘సాక్షి’తో కథనం ప్రచురితమైనప్పటికీ అధికారులు నోటి మాటలతోనే సరిపెట్టారు. అర్ధరాత్రి వేళ అమ్మకాలు జరిగినా బార్ అండ్ రెస్టారెంట్లపై కనీస నిబంధనల ప్రకారం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. దీంతోపాటు పోలీసులు సైతం సమావేశం ఏర్పాటు చేసి యాక్షన్ తీసుకుంటామని ‘యాక్షన్’ చేశారు తప్ప, ఎటువంటి చర్యలు చేపట్టలేదనే ఆరోపణలు వస్తున్నాయి. ప్రత్యేక టీమ్ను ఏర్పాటు చేస్తామని చెబుతున్నారుగానీ, ఏడాది కాలంలో ఏ ఒక్కరోజూ ఇది అమలు కాలేదు. గతంలో సైతం బహిరంగ మద్యపానం, ఎమ్మార్పీ ధరలు, అర్ధరాత్రి అమ్మకాల విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ చర్యలు చేపడతామని చెప్పారేగానీ, చేతల్లో మాత్రం ఆ విషయం చూపలేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మూడు నెలలు మాత్రమే వ్యవధి ఉందని, అధికారులకు అన్ని విధాలా సహాయంగానే ఉంటున్నామని, ప్రతినెలా మామూళ్లు చెల్లిస్తున్నామని, చూసీచూడనట్లు పోవాలని ఎకై ్సజ్, పోలీసు అధికారులతో వ్యాపారులు విన్నవించినట్లు సమాచారం. కొద్దిరోజులు పేరుకు తాము తనిఖీలు నిర్వహిస్తామని, ఆ సమయంలో కొద్దిరోజులపాటు నియమాలు పాటించాలని పోలీసు అధికారులు సూచించినట్లు తెలుస్తోంది.
అర్ధరాత్రి మద్యం అమ్మకాలపై
చర్యలు శూన్యం