
ఐసెట్లో సత్తా చాటిన మనోళ్లు
గుంటూరుఎడ్యుకేషన్: ఏపీ ఐసెట్–2025 ఫలితాల్లో గుంటూరు జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. మంగళవారం ప్రకటించిన ఫలితాల్లో ఉమ్మడి గుంటూరు జిల్లాలో 96 శాతం ఉత్తీర్ణత నమోదైంది. తాడికొండ మండలం లాం గ్రామానికి చెందిన రావూరి మాధుర్య రాష్ట్రస్థాయిలో 5వ ర్యాంకు సాధించింది. గుంటూరు జిల్లా నుంచి ఐసెట్కు హాజరైన 1,528 మంది విద్యార్థుల్లో 1,485మంది ఉత్తీర్ణులయ్యారు. బాపట్ల, చీరాల నుంచి పరీక్షలు రాసిన 354మందివిద్యార్థుల్లో 338మంది ఉత్తీర్ణత సాధిం చారు. పల్నాడు జిల్లాలో పరీక్షకు హాజరైన 725 మంది విద్యార్థుల్లో 678 మంది ఉత్తీర్ణులయ్యారు.
కోచింగ్ లేకుండానే 5వ ర్యాంకు
ఐసెట్లో రాష్ట్రస్థాయిలో 5వ ర్యాంకు సాధించిన విద్యార్థిని రావూరి మాధుర్య ఎటువంటి కోచింగ్ తీసుకోలేదు. ఆమె తండ్రి నాగేశ్వరరావు గతంలో వ్యవసాయం చేసేవారు. ప్రస్తుతం ఆర్కెస్ట్రా గ్రూప్లో తబలా వాయిద్యం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. ఆయనకు ఇద్దకు కుమార్తెలు కాగా పెద్దమ్మాయి స్రవంతి అగ్రికల్చర్ బీఎస్సీ పూర్తి చేసి, ప్రస్తుతం బ్యాంకు ఉద్యోగాలకు సన్నద్ధమవుతోంది. రెండో కుమార్తె మాధుర్య 2022లో కాకినాడ జేఎన్టీయూ నుంచి బీటెక్ పూర్తి చేసింది. అయితే కేంద్ర ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాన్ని సాధించాలనే లక్ష్యంతో స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్సెస్సీ) నిర్వహించే పరీక్షలకు సన్నద్ధమవుతోంది. ప్రామాణిక పుస్తకాలను చదువుతూ సొంతంగా ప్రిపేర్ అవుతోంది. ఎస్సెస్సీ పరీక్షలకు వ్యవధి ఉండటంతో ఏపీ ఐసెట్కు దరఖాస్తు చేసి, ఎటువంటి కోచింగ్ లేకుండా నేరుగా పరీక్ష రాసి రాష్ట్రస్థాయిలో 5వ ర్యాంకు కై వసం చేసుకుంది.
ఉమ్మడి గుంటూరు జిల్లాలో 96 శాతం ఉత్తీర్ణత లాం విద్యార్థినికి రాష్ట్రస్థాయిలో 5వ ర్యాంకు