
కచ్చితమైన ఆధారాలతో శిక్షలు
జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు
నరసరావుపేట: క్షేత్రస్థాయిలో ఆధారాల సేకరణలో కచ్చితత్వం పాటిస్తే ముద్దాయిలకు శిక్షలు పడే విధంగా చేయవచ్చని జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు పేర్కొన్నారు. గురువారం జిల్లా కలెక్టరేట్లోని గుర్రం జాషువా కాన్ఫరెన్స్ హాలులో జిల్లా పోలీసుశాఖ ఆధ్వర్యంలో పోలీస్ అధికారులకు ‘ఫోరెన్సిక్ ఎవిడెన్స్ మేనేజ్మెంట్’ అంశంపై నిర్వహించిన వర్క్షాపులో జిల్లా ఎస్పీ మాట్లాడారు. నిపుణులు అందించిన మెలకువలను క్షేత్రస్థాయిలో ఉపయోగించి కేసుల్లో ముద్దాయిలకు శిక్షలు పడే విధంగా సమగ్ర దర్యాప్తు చేపట్టాలని ఎస్పీ సూచించారు. ఫోరెన్సిక్ నిపుణులు డి.కాంచన, ఎల్.స్వాతి, కె.సురేంద్రబాబు, ఫోరెన్సిక్ అసిస్టెంట్ డైరక్టర్లు బి.రామకృష్ణారావులు దర్యాప్తు ప్రక్రియకు ఉపకరించే అనేక మెలకువలను పోలీస్ అధికారులకు వివరించారు. జిల్లాలోని డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు. అనంతరం ఫోరెన్సిక్ సైంటిఫిక్ అధికారులకు ఎస్పీ శాలువా కప్పి మెమొంటోలతో సత్కరించారు.