
పిన్నెల్లి సోదరులపై హత్య కేసు మోపడం దారుణం
వైఎస్సార్ సీపీ బీసీ సెల్ రాష్ట్ర జనరల్ సెక్రటరీ శివనాగేశ్వరరావు
సత్తెనపల్లి: పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలోని జంట హత్యల కేసులో పిన్నెల్లి సోదరులపై హత్యా కేసు మోపడం దారుణమని వైఎస్సార్ సీపీ బీసీ సెల్ రాష్ట్ర జనరల్ సెక్రటరీ, సీనియర్ న్యాయవాది రాజారపు శివనాగేశ్వరరావు అన్నారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో సోమవారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. ఇరువురు టీడీపీ కార్యకర్తలైన జెట్టి వెంకటేశ్వర్లు అలియాస్ మొద్దయ్య, ఆయన సోదరుడు కోటేశ్వరరావులను ఈ నెల 24న పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం లోని బోదేలవీడు – మండాది గ్రామాల మధ్య జరిగిన హత్యలు టీడీపీలోని రెండు వర్గాల ఆదిపత్య పోరులో భాగంగా జరిగాయని, ఈ విషయాన్ని ప్రత్యక్ష సాక్షి చెబుతున్నా.. పోలీసులు పట్టించుకోకుండా రెడ్బుక్ రాజ్యాంగం ప్రకారం మాచర్ల మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ పల్నాడు జిల్లా అధ్యక్షుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు పిన్నెల్లి వెంకట్రామిరెడ్డిపై అక్రమంగా, అన్యాయంగా హత్యానేరం మోపడం దారుణమైన విషయమన్నారు. ఈ కేసుకు పిన్నెల్లి సోదరులకు ఏ విధమైన సంబంధం లేదని, తెలుగుదేశం పార్టీలోని రెండు వర్గాలకు గతం నుంచే ఆదిపత్య్హ పోరు ఉందని ఒక వర్గంపై మరొక వర్గం గతం నుంచే గొడవలు పడేవారని గ్రామస్తులు చెబుతున్నా పోలీసు అక్రమ కేసులు బనాయిస్తున్నారన్నారు.
హామీల అమలుపై దృష్టి మరల్చేందుకే..
రాష్ట్రంలోని 175 నియోకవర్గాలల్లోని వైఎస్సార్ సీపీ నాయకులపై అక్రమ కేసులు పెట్టించడమే రెడ్ బుక్ రాజ్యాంగం అమలులో భాగమని విమర్శించారు. 2024 సార్వత్రిక ఎన్నికలలో తల్లికి వందనం ఇస్తానని, రైతులకు అన్నదాత సుఖీభవ ఇస్తానని, మహిళలకు 3 గ్యాస్ సిలెండర్లు ఇస్తానని, మహిళలకు ఫ్రీ బస్ సౌకర్యం ఏర్పాటు చేస్తానని, నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తానని, ప్రతి మహిళకు నెలకు రూ.1,500 నగదు ఇస్తామని, ఇంటింటికి సూపర్ సిక్స్ పేరు చెప్పి మాయమాటలతో అధికారంలోనికి వచ్చిన కూటమి నేడు ఆ హామీలు ఒక్కటైనా అమలు చేయకుండా, ప్రజల దృష్టి మరల్చేందుకే ఇటువంటి డ్రామాలు ఆడుతోందని పేర్కొన్నారు. టీడీపీ నాయకులు చేసే అక్రమాలు, అన్యాయాలను ప్రజలు గమనిస్తున్నారని వాటికి త్వరలోనే మూల్యం చెల్లించుకోవలసి వస్తుందని హెచ్చరించారు.