
అసిస్టెంట్ ఏఎంఓ పోస్ట్కు దరఖాస్తు చేసుకోండి
నరసరావుపేట ఈస్ట్: సమగ్ర శిక్ష పల్నాడు జిల్లా కార్యాలయంలో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ అకడమిక్ మానిటరింగ్ ఆఫీసర్ (ఉర్దూ) పోస్ట్కు అర్హులైన ఉపాధ్యాయుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు జిల్లా విద్యాశాఖాధికారి ఎల్.చంద్రకళ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాలోని ప్రభుత్వ, జిల్లా పరిషత్, మున్సిపల్ పాఠశాలల్లో పనిచేస్తున్న ఎస్జీటీలు ఈనెల 7వ తేది నుంచి 26వ తేదీ సాయంత్రం 5గంటలలోపు అధికారుల ద్వారా ధ్రువీకరించిన తమ దరఖాస్తులను డీఈఓ, సమగ్ర శిక్ష కార్యాలయంలో అందజేయాలని స్పష్టం చేశారు. ఆసక్తి గల ఉపాధ్యాయులు ఇతర వివరాలకు జీసీడీఓ డి.రేవతి (9440642122), ఏఎల్ఎస్సీ కోఆర్డినేటర్ కె.శ్రీనివాసరావు (8074499649)లకు సంప్రదించాలని తెలిపారు.
ఐఎల్ఏ అధ్యక్షుడిగా బాబురావు
సత్తెనపల్లి: ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ (ఐఎల్ఏ) అధ్యక్షుడిగా సత్తెనపల్లికి చెందిన న్యాయవాది చావా బాబురావు, నియమితులయ్యారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో అసోసియేషన్ సత్తెనపల్లి యూనిట్ సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు జి.శాంత కుమార్ ఆయనను నియమించారు. అలాగే కార్యదర్శిగా పాటిబండ్ల రవిని నియమించారు. ఈ సందర్భంగా బాబురావు, రవిలు మాట్లాడుతూ ప్రజా సమస్యలపై తమ వంతుగా పాటుపడుతూ వాటి పరిష్కారం దిశగా పని చేస్తామన్నారు. నూతనంగా నియమితులైన వారికి రాష్ట్రకార్యవర్గ సభ్యులు ఊర్ల విష్ణుకుమార్, ఎ.బ్రహ్మేశ్వరరావు, పల్నాడు జిల్లా అధ్యక్షుడు దాసరి జ్ఞాన్రాజ్పాల్, జిల్లా కార్యదర్శి బొక్కా సంగీతరావు, ఉటికూరి పాపారావు, తలతోటి ఆనంద శ్రీనివాసరావు, జొన్నలగడ్డ విజయ్ కుమార్, సూరె వీరయ్య, మామిడి ప్రకాష్, తదితరులు అభినందనలు తెలిపారు.
కుమారుడి దాడితో తండ్రి మృతి!
చిలకలూరిపేటటౌన్: అనుమానస్పద రీతిలో వృద్ధుడు మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని మురికిపూడి గ్రామానికి చెందిన తాపీ మేసీ్త్ర చంబేటి రామకృష్ణ భార్య బుధవారం చిలకలూరిపేట పట్టణంలోని ఓ ఆస్పత్రిలో కుమార్తెకు జన్మనిచ్చింది. ఈ విషయం తెలిసి ఆస్పత్రికి ఎందుకు రాలేదంటూ తండ్రి చంబేటి శ్రీనివాసరావు(43) రామకృష్ణను ప్రశ్నించాడు. ఇద్దరి మధ్య వాగ్వాదం జరగ్గా, మద్యం మత్తులో ఆవేశంగా తండ్రి కాళ్లపై కర్రతో రామకృష్ణ దాడి చేశాడు. అసలే ఐదేళ్లుగా సోరియాసిస్ వ్యాధితో బాధపడుతున్న శ్రీనివాసరావు తీవ్రంగా గాయపడి గురువారం ఉదయం మృతి చెందాడు. దీంతో మృతుడు శ్రీనివాసరావు తల్లి లక్ష్మి తన కుమారుడు.. మనవడి దాడి కారణంగానే మృతి చెందాడా, లేక మరేదైనా కారణమా కనుగొనాలని పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో అనుమానాస్పద మృతిగా రూరల్ ఎస్ఐ జి.అనిల్కుమార్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. శ్రీను మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.