
అర్ధాకలి బతుకులు
అందని సరుకులు
● అస్తవ్యస్తంగా పౌర సరఫరా వ్యవస్థ ● బియ్యం, పంచదారతో సరి ● మిగిలిన సరుకుల ఊసే ఎత్తని ప్రభుత్వం ● కానుకలకు మంగళం ● ఆకలితో అలమటిస్తున్న పేదలు
కూటమి ప్రభుత్వం పేదలను గాలికొదిలేసింది. ఇప్పటికే పేదలకు ఇవ్వాల్సిన పలు పథకాలను ఆపేసిన సర్కారు చౌక దుకాణాల ద్వారా అందించే సరుకుల్లో కోత విధించి, వారి నోటికాడ కూడు లాగేసేలా వ్యవహరిస్తోంది. నిత్యావసరాలు ఆకాశాన్నంటుతూ.. ఏం కొనీ,తినలేని దుస్థితిలో ఉన్న పేదలను ఆదరించాల్సిన ప్రభుత్వం రేషన్ సరుకులకు మంగళం పాడేసి, మరింత దుర్భర పరిస్థితుల్లోకి నెట్టేస్తోంది. గతంలో ధరలెంత పెరిగినా ప్రభుత్వం ఇచ్చే రేషన్ సరుకులు ఉన్నాయిలే అనే ధీమా ప్రజల్లో కనిపించేది.. నేడు అరకొర సరుకులిస్తూ ప్రభుత్వం చేతులు దులిపేసుకోవడంతో అర్ధాకలితో అలమటిస్తున్నారు.
పస్తులతో చస్తున్నా పట్టని సర్కారు
నరసరావుపేట టౌన్/క్రోసూరు: రాష్ట్రంలో పది నెలల క్రితం కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టింది. అధికారంలోకి వచ్చింది దరిమిలా రాజధాని అంటూ హడావుడి మినహా పేద ప్రజల వైపు కన్నెత్తి చూసిందే లేదు.. వారి బాగోగులకు సంబంధించి చేసిందేమీ లేదు. పైపెచ్చు వీటిని ప్రశ్నించేవారిపై అక్రమ కేసుల కత్తిపెట్టి నోరు మూయిస్తోంది. పేద వర్గాల ప్రజలకు ఏం అవసరమో తెలుసుకునే ప్రయత్నం చేయనేలేదు. రేషన్ బియ్యం బండి వస్తే గతంలో పెద్ద సంచి తీసుకుని నిండుగా సరుకులతో ఇంటికి చేరుకునేవారు. ఇప్పుడు కేవలం బియ్యం, పంచదారతో సరిపెట్టడంతో అటు సంచీ.. ఇటు కడుపూ రెండూ నిండడం లేదు. దీని గురించి పట్టించుకోవడానికి ప్రభుత్వ పెద్దలకు మనసు రావడం లేదు. బహిరంగ మార్కెట్లో నిత్యావసరాలు ఆకాశాన్నంటుతున్న తరుణంలో చౌక దుకాణాల ద్వారా ప్రభుత్వం సక్రమంగా సరుకులు పంపిణీ చేయకపోవడంతో పేదలు ఆర్థిక భారాన్ని మోస్తున్నారు.
పేదలు కనిపించడం లేదా ?
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పౌర సరఫరాల వ్యవస్థను పూర్తిగా విస్మరించింది. పది నెలలుగా కొత్త రేషన్ కార్డుల ఊసే ఎత్తలేదు. తాజాగా ఒక రోజు ముందు నుంచి కొత్త రేషన్ కార్డుల మంజూరుకు దరఖాస్తులు తీసుకుంటామని ప్రకటించింది. ఈ పది నెలల్లో నూతన రేషన్ కార్డులు లేక, కార్డుల్లో పేర్లు మార్పులు, చేర్పులు చేయడానికి వీలుగాక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మరో వైపు ప్రభుత్వం రేషన్ పంపిణీని గాలికొదిలేసింది. రేషన్ దుకాణాల ద్వారా రాగులు అందిస్తామని చెప్పి.. కేవలం మాటలకే పరిమితం చేసింది. దీంతో పేద వర్గాల ప్రజలు అర్ధాకలితో అలమటిస్తున్నారు.
కానుకలు మాయం
2014లో అధికారం చేపట్టాక సీఎం చంద్రబాబు నాయుడు ఆర్భాటంగా రంజాన్ తోఫా, సంక్రాంతి కానుక, క్రిస్మస్ కానుక అందించారు. ఇవి నాసిరకంగా ఉన్నాయంటూ అప్పట్లో ప్రజలు మండిపడ్డారు. మళ్లీ అధికారంలోకి వస్తే ఇవే కానుకలు ఇస్తానని ఎన్నికల ముందు ప్రకటించారు. అధికారం చేపట్టాక వీటి గురించి పట్టించుకున్న దాఖలాలు లేవు. కానుకలు సరే.. కనీసం సరుకులన్నా పూర్తిగా ఇవ్వండయ్యా అని ప్రజలు వేడుకుంటున్నారు.
● రేషన్ సరుకులలో కందిపప్పు, రాగులు, జొన్నలు, వంట నూనె తదితర నిత్యావసరాలు పంపిణీ చేయకపోవడంపై జిల్లా పౌరసరఫరాల అధికారి నారదమునిని వివరణ కోరేందుకు ప్రయత్నించగా ఆయన స్పందించలేదు.
గత ప్రభుత్వంలో ఇంటి వద్దకే..
గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో అన్ని సరుకులు ఇచ్చేవారు. ఇంటి వద్దకే ఎండీయూ వాహనాల ద్వారా సరుకులు వచ్చేవి. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రత్యేక దృష్టి సారించి రేషన్ సరఫరాను ప్రజలకు అత్యంత సులువుగా చేరేలా చర్యలు తీసుకున్నారు. పౌర సరఫరాల వ్యవస్థ ద్వారా నాణ్యమైన సన్నరకం బియ్యం, పంచదార, గోధుమలు, నూనె, కందిపప్పు, చింతపండు తక్కువ ధరకే అందించారు. దీంతో పేద వర్గాల ప్రజలకు మూడు పూటలా నాలుగు వేళ్లు నోట్లోకి వెళ్లేవి. దీంతోపాటు రేషన్ అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేశారు.
వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో అందిన సరుకులు
నాణ్యమైన బియ్యం
కందిపప్పు
పంచదార
నూనె
గోధుమలు
చింతపండు
కూటమి ప్రభుత్వంలో..
బియ్యం
పంచదార (కొన్ని ప్రాంతాల్లోనే..)

అర్ధాకలి బతుకులు

అర్ధాకలి బతుకులు