
నేటి నుంచి శ్రీరంగనాథ కల్యాణోత్సవాలు
యడ్లపాడు: మండలంలోని సొలస గ్రామంలో వేంచేసి ఉన్న, కొండవీడు ప్రాంతంలోని ప్రాచీన ఆలయాల్లో ఒకటైన శ్రీభూసమేత రంగనాయకస్వామి ఆలయం కనుమరుగైన చరిత్రకు ప్రత్యక్ష ప్రతిరూపం. కేవలం ఇది ఓ కట్టడమే కాదు, గతకాలపు సంస్కృతిని, నమ్మకాలను, భక్తిశ్రద్ధలను ఆవాహనం చేసుకున్న పవిత్ర కోవెల. ఈనెల 8 నుంచి 14వ తేదీ వరకు దేవస్థానంలో కల్యాణ మహోత్సవాలు జరగనున్నాయి.
‘వలస’లే ‘సొలస’గా మారి..
పూర్వం రంగపట్నం ఏర్పడ్డ ప్రదేశానికి పడమర దిశగా అంతా కీకారణ్యంగా ఉన్న ఈ ప్రాంతంలో నాదెండ్లకు చెందిన కొందరు తమ పశువులతో వచ్చారు. వీరిలో వలసయ్య అనే నాయకుడు కొండవాడు నీటిని ఒడిసి పట్టేందుకు రామన్న పేరుతో ఓ చెరువును తవ్వించి, ఈ ప్రాంతానికి జీవనాడిని అందించాడు. కొన్నాళ్లకు అది ఓ గ్రామంగా మారింది. నాడు ఏర్పడిన ఆ గ్రామమే నేటి సొలస. ‘వలసయ్య’ నామమే కాలక్రమేణ సొలసగా రూపాంతరం చెందినదని కొందరు..‘వలస’ ప్రాంతం కాబట్టి వాడుక భాషలో ‘సొలస’గా మారిందని మరికొందరి వాదన ఇక్కడ వినిపిస్తుంది.
అనువంశిక బాధ్యతలు
ఈ దేవాలయానికి ప్రస్తుతం 150 ఎకరాల భూమి ఉంది. యడ్లపాడు, వేమవరం, తూబాడు వంటి ప్రాంతాల్లో స్వామివారి ఆస్తులు ఉన్నాయి. ప్రస్తుతం ఈ ఆలయం దేవదాయశాఖ పర్యవేక్షణలో ఉంది. ఆలయ తొలి అర్చకులు ఉన్నవ గ్రామస్తుడు పర్చూరి వెంకట రమణాచార్యులు కాగా, అనువంశిక బాధ్యతలు గైకొన్న ప్రస్తుత ఆలయ అర్చకుడు పర్చూరి రామకృష్ణమాచార్యులు ఐదోతరంవాడిగా, అర్వపల్లి మనోహర్, నాగజ్యోతి దంపతులు ఆరో తరానికి చెందిన ధర్మకర్తలుగా వ్యవహరిస్తున్నారు.
ఏడాదిలో ఒక్క రోజే నిజరూప దర్శనం
గర్భగుడి రెండు వైపులా జయవిజయులు నిలిచి ఆలయానికి ఆభరణంగా ఉంటారు. గర్భగుడిలో శేషతల్పంపై యోగనిద్రలో ఉన్న రంగనాథునికి శ్రీదేవి, భూదేవులు పాదసేవ చేస్తూ కనిపిస్తారు. ఈ క్షేత్ర విశేషాల్లో ముఖ్యంగా ఆంజనేయస్వామి రెండు రూపాలు చూడవచ్చు. ఒకటి స్థానక భంగిమలో నల్లరాతి విగ్రహం, మరొకటి గోడపై వర్ణరంజిత రూపం. ఇక్కడ గణపతి విగ్రహం గుండ్ర ని భూ ఆకృతిలో ఉండటం విశిష్టత. ప్రతీ సంవత్సరం వైశాఖ పౌర్ణమికి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతాయి. ఇందులో కీలకంగా, నాలుగు రోజుల ముందు స్వామివారి అలంకారాలు తొలగించి ఒక్కరోజు భక్తులకు నిజరూప దర్శనం కలిగించడం ఈ ఆలయ వైశిష్ట్యం.

నేటి నుంచి శ్రీరంగనాథ కల్యాణోత్సవాలు