మెకానిక్‌ కిడ్నాప్‌ కలకలం | - | Sakshi
Sakshi News home page

మెకానిక్‌ కిడ్నాప్‌ కలకలం

May 8 2025 7:59 AM | Updated on May 8 2025 11:13 AM

మెకానిక్‌ కిడ్నాప్‌ కలకలం

మెకానిక్‌ కిడ్నాప్‌ కలకలం

● చండ్రాజుపాలెంలో పాడుబడిన ఇంటిలో నిర్బంధించిన దుండగులు ● తప్పించుకొని పట్టణ పోలీసులకు సమాచారం ఇచ్చిన బాధితుడు

సత్తెనపల్లి: పల్నాడు జిల్లా సత్తెనపల్లి ఆటోనగర్‌లో గ్యారేజ్‌ నడుపుతున్న మెకానిక్‌ కిడ్నాప్‌ కలకలం సృష్టించింది. వివరాలు ఇలా ఉన్నాయి.. పట్టణంలోని రఘురాం నగర్‌కు చెందిన షేక్‌ మస్తాన్‌వలి గుంటూరు రోడ్‌లోని ఆటోనగర్‌లో ఆటో గ్యారేజ్‌ నడుపుతున్నాడు. ఆయనకు కొంతకాలంగా పట్టణంలోని వడవల్లిలో నివసించే బెల్లంకొండ మండలం చండ్రాజుపాలెం గ్రామానికి చెందిన తోకా ప్రకాష్‌ పరిచయమయ్యాడు. పాత వాహనాలు కొనుగోలు చేసి మరమ్మతులు చేస్తూ విక్రయించటం చేస్తుంటాడు. ఈ క్రమంలో మస్తాన్‌వలికి చెందిన ఓ ఇంటిని ప్రకాష్‌ కొనుగోలు చేశాడు. దీనిపై నగదుకు సంబంధించి ఇరువురి మధ్య వివాదం నెలకొంది. ఒకరిపై ఒకరు పోలీస్టేషన్‌లో ఫిర్యాదులు చేసుకున్నారు. ఈ క్రమంలో మస్తాన్‌వలి పట్టణ పోలీసులను ఆశ్రయించగా ఇది సివిల్‌ వివాదం అని, కోర్టులో పరిష్కరించుకోవాలని సూచించారు. దీంతో మస్తాన్‌వలి ఈ నెల 5న కోర్టును ఆశ్రయించాడు. విషయం తెలుసుకున్న ప్రకాష్‌ తన దగ్గర సరైన కాగితాలు లేకపోవడంతో మంగళవారం రాత్రి 9 గంటల సమయంలో తాను ఆటో గ్యారేజీ మూసివేసి ఇంటికి వెళుతుండగా మరో నలుగురితో కలిసి కారులో వచ్చి తనను అడ్డగించారని, తనను కారులో ఎక్కించుకొని అటూ ఇటూ తిప్పుతూ తనపై దాడి చేశారని మస్తాన్‌వలి తెలిపాడు. కొంతసేపటి తర్వాత తనను చండ్రాజుపాలెం గ్రామానికి తీసుకెళ్లి ఊరు చివరన పాడుబడిన ఇంట్లో చేతులు, కాళ్లు కట్టేసి నిర్బంధించారన్నాడు. కొద్దిసేపటికి తప్పించుకున్న తాను పట్టణ పోలీసులకు సమాచారం ఇచ్చానని, హుటాహుటిన పోలీసులు తనను చికిత్స నిమిత్తం ఏరియా వైద్యశాలకు తరలించారన్నారు. ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం గుంటూరు తరలించారన్నారు. ఇంటి వివాదం నేపథ్యంలో ఇరువురు మధ్య నెలకొన్న మనస్పర్థలు వారి మధ్య కిడ్నాప్‌, దాడికి కారణమైనట్లు పోలీసులు భావిస్తున్నారు. క్షతగాత్రుడు మస్తానవలి ఫిర్యాదు మేరకు పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement