
జిల్లా వ్యాప్తంగా పోలీసుల తనిఖీలు
నరసరావుపేట: ఆపరేషన్ సింధూర్ నేపధ్యంలో జిల్లావ్యాప్తంగా పోలీసులు బుధవారం సాయంత్రం నుంచి అసాంఘికశక్తుల కార్యకలాపాల నిరోధానికి రైల్వేస్టేషన్లు, బస్టాండ్లు, లాడ్జీల్లో తనిఖీలు నిర్వహించారు. జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు ఆదేశాలతో నగరం, పట్టణ శివారు ప్రాంతాల్లో బహిరంగంగా మద్యం సేవించిన వారిపై పోలీసు అధికారులు దాడులు నిర్వహించి కేసులు నమోదు చేశారు. ప్రజాశాంతికి భంగం కలిగించటం, మద్యం సేవించి వాహనాలు నడపటం లాంటి వాటికి పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రధాన రహదారులపై విస్తృతంగా వాహనాలు తనిఖీలు చేపట్టారు.
ధాన్యం కొనుగోలు చేస్తాం
ఇరుకుపాలెం(ముప్పాళ్ళ): రైతుల వద్ద ఉన్న ధాన్యం నిల్వలను కొనుగోలు చేస్తామని జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారి నారదముని చెప్పారు. మండలంలోని ఇరుకుపాలెంలో రైతుల వద్ద గల ధాన్యం నిల్వలను బుధవారం పరిశీలించారు. సత్తెనపల్లిలో జరిగిన నియోజకవర్గ సమీక్షా సమావేశంలో ధాన్యం కొనుగోలు చేయటం లేదని పలువురు రైతులు జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకురావటంతో ఆయన ఆదేశాల మేరకు ధాన్యం నిల్వలను పరిశీలించారు. రైతులతో మాట్లాడి రేపటిలోగా ధాన్యం సేకరిస్తామని చెప్పారు. అనంతరం తేమశాతాన్ని పరిశీలించారు. తహసీల్దార్ ఎం.భవానీశంకర్, ఎఓ ఎం.అరుణ ఉన్నారు.

జిల్లా వ్యాప్తంగా పోలీసుల తనిఖీలు