
కోర్టును సందర్శించిన జిల్లా ప్రధాన న్యాయమూర్తి
పొన్నూరు: జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి.సాయి కల్యాణ్ చక్రవర్తి మంగళవారం పట్టణంలోని ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టును సందర్శించారు. నూతనంగా నిర్మాణం చేపట్టాల్సిన కోర్టు భవనాలకు సంబంధించిన విషయాలను తెలుసుకున్నారు. ఆయనకు కోర్టు న్యాయమూర్తి ఏకా పవన్కుమార్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు షేక్ బాజీ సాహెబ్, సభ్యులు పుష్పగుచ్ఛాలు అందజేసి స్వాగతం పలికారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు పొందుగుల జయరాజు, మున్సిపల్ స్టాండింగ్ కౌన్సిల్ తూమాటి రమేష్, ఏజీపీ ఎన్.శ్రీనివాస్, న్యాయవాదులు, గుమస్తాలు, సిబ్బంది పాల్గొన్నారు.
జెడ్పీ బడ్జెట్ను
ఆమోదించిన ప్రభుత్వం
గుంటూరు ఎడ్యుకేషన్ : ఉమ్మడి గుంటూరు జిల్లా ప్రజా పరిషత్ 2025–26 ఆర్థిక సంవత్సర బడ్జెట్ను ప్రభుత్వం ఆమోదించింది. ఈమేరకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ మంగళవారం ఉత్తర్వులు విడుదల చేశారు. గత మార్చి 31 నాటికే ఆమోదం పొందాల్సిన బడ్జెట్ను ఆమోదించలేకపోవడంతో పంచాయతీరాజ్ చట్టంలోని సెక్షన్ 199 సబ్ రూల్ 3 కింద బడ్జెట్ ఆమోదం కోసం జెడ్పీ సీఈవో వి.జ్యోతిబసు గత నెలలో ప్రభుత్వానికి పంపారు. 2025–26 ఆర్థిక సంవత్సరానికి రూ.643 కోట్ల ఆదాయంతో రూపొందించిన అంచనా బడ్జెట్ను ఆమోదించారు.
ఎస్సీ కార్పొరేషన్ ఈడీగా కె.శ్రీనివాస్
నెహ్రూనగర్: గుంటూరు జిల్లా ఎస్సీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్గా కె.శ్రీనివాస్ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. రెవెన్యూ సర్వీసెస్ నుంచి డెప్యూటీ కలెక్టర్ స్థాయిలో పనిచేస్తున్న ఆయన్ను గుంటూరు ఎస్సీ కార్పొరేషన్ ఈడీగా బదిలీ చేశారు. గతంలో ఈడీగా పనిచేసిన పి.ప్రేమకుమారి ఉద్యోగ విరమణ చేయడంతో ఇన్చార్జి ఈడీగా దుర్గాబాయి బాధ్యతలు నిర్వహించారు. నూతన ఈడీగా శ్రీనివాస్ బాధ్యతలు చేపట్టి, కలెక్టర్ ఎస్.నాగలక్ష్మిని మర్యాదపూర్వకంగా కలిసి బొకే అందజేశారు.
జిల్లాలో ఏఎస్ఐలు, హెచ్సీలు, కానిస్టేబుళ్ల బదిలీలు
నగరంపాలెం: జిల్లాలోని పోలీస్స్టేషన్ల్లో ఐదేళ్లు పూర్తయిన కానిస్టేబుళ్లు నుంచి ఏఎస్ఐలకు మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయ (డీపీఓ) ఆవరణలోని హాల్లో బదిలీల ప్రక్రియ చేపట్టారు. ఈ ప్రక్రియను జిల్లా ఎస్పీ సతీష్కుమార్ పర్యవేక్షించారు. 12 మంది ఏఎస్ఐలు, 27 మంది హెడ్ కానిస్టేబుళ్లు, మరో 27 మంది కానిస్టేబుళ్లకు స్థానచలనం చేశారు. జిల్లా ఎస్పీ సతీష్కుమార్ మాట్లాడుతూ సమర్ధవంతంగా విధులు నిర్వర్తించాలని అన్నారు. క్షేత్రస్థాయిలో ప్రజలకు సేవలందించేందుకు అందుబాటులో ఉండాలని చెప్పారు.జిల్లా ఏఎస్పీ జీవీ.రమణమూర్తి (పరిపాలన), ఏఓ అద్దంకి వెంకటేశ్వరరావు, జిల్లా ఎస్పీ సీసీ ఆదిశేషు, జూనియర్ సహాయకులు పాల్గొన్నారు.
రైల్వే అధికారులకు
ఆహ్వానం లేదు
లక్ష్మీపురం: శంకర్ విలాస్ ఫ్లైఓవర్ శంకుస్థాపనకు గుంటూరు రైల్వే డివిజన్ అధికారులకు ఎలాంటి ఆహ్వానం లేకపోవడం చర్చనీయాంశంగా మారింది. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేతుల మీదుగా బుధవారం శంకుస్థాపన చేసేందుకు ముహూర్తం నిర్ణయించారు. అయితే అనివార్య కారణాల వల్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాకపోవడంతో బుధవారం ఉదయం 9 గంటలకు కేంద్ర సహాయక మంత్రి పెమసాని చంద్రశేఖర్ శంకుస్థాపన చేయనున్నారు. శంకుస్థాపనకు సంబంధించి ఎటువంటి సమాచారం లేకపోవడంతో గుంటూరు డీఆర్ఎం బుధవారం ఉదయం రేపల్లె రైల్వేస్టేషన్ తనిఖీలకు వెళ్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.

కోర్టును సందర్శించిన జిల్లా ప్రధాన న్యాయమూర్తి