
కొనసాగిన కార్మికుల సమ్మె
నరసరావుపేట: తమకు పూర్తిజీతాలు చెల్లించాలని కోరుతూ కొంతమంది మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు చేస్తున్న నిరసన దీక్షలు మంగళవారం 48వ రోజుకు చేరాయి. యూనియన్ పల్నాడు జిల్లా కార్యదర్శి అమరారపు సాల్మన్ మాట్లాడుతూ శాంతియుత నిరసన ద్వారా తమ సమస్యలు పరిష్కారమయ్యేవరకు పోరాటం కొనసాగిస్తామని పేర్కొన్నారు. కార్మికులు తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని రెండు నెలలుగా పురపాలక సంఘం కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేస్తున్నా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించకపోవడం దుర్మార్గమన్నారు. దీనిపై జిల్లా కలెక్టర్, ఇన్చార్జి మంత్రి, ఎమ్మెల్యే జోక్యం చేసుకొని సమస్య పరిష్కరించాలని కోరారు.
నేడు పేరేచర్ల–కొండమోడు రహదారి విస్తరణకు శంకుస్థాపన
సత్తెనపల్లి: తాటికొండ నియోజకవర్గం మేడికొండూరు మండలం పేరేచర్ల–సత్తెనపల్లి నియోజక వర్గం రాజుపాలెం మండలం కొండమోడు నాలుగు లైన్ల రహదారి విస్తరణ పనులకు బుధవారం సాయంత్రం 4.00 గంటలకు శంకుస్థాపన చేయనున్నారు. ఈ కార్యక్రమానికి రోడ్లు, భవనాలు, మౌలికసదుపాయాలు, పెట్టుబడుల శాఖ మంత్రి బీసీ జనార్ధన్రెడ్డి హాజరుకానున్నారు. రాజుపాలెం మండలం రెడ్డిగూడెం వద్ద ఏర్పాటుచేసిన నేషనల్ హైవే (ఎన్హెచ్ –167 ఏజీ)కి సంబంధించిన నాలుగు లైన్ల రహదారి విస్తరణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఆయనతోపాటు నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యేలు కన్నా లక్ష్మీనారాయణ (సత్తెనపల్లి), యరపతినేని శ్రీనివాసరావు(గురజాల), భాష్యం ప్రవీణ్(పెదకూరపాడు), తెనాలి శ్రావణ్ కుమార్(తాటికొండ) పాల్గొననున్నారు.
తొండపిలో ఘర్షణ
ముప్పాళ్ల: ఇరువురి మధ్య వివాదం ముదిరి జరిగిన ఘర్షణలో ఒకరికి తలకు గాయమైన సంఘటన మండలంలోని తొండపి గ్రామంలో మంగళవారం జరిగింది. గ్రామానికి చెందిన దుగ్గినేని రామారావు, చల్లా శ్రీనివాసరావుల మధ్య వివాదం జరిగింది. వివాదం ముదిరి రామారావు గడ్డపారతో శ్రీనివాసరావు తలపై కొట్టడంతో తలకు తీవ్రగాయమైంది. గాయపడిన శ్రీనివాసరావుకు సత్తెనపల్లిలో ప్రాథమిక చికిత్స అందించి మెరుగైన చికిత్స నిమిత్తం గుంటూరుకు తరలించారు. జరిగిన సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వి.సోమేశ్వరరావు తెలిపారు.
శక్తి యాప్ను సద్వినియోగం చేసుకోవాలి
జిల్లా ఎస్పీ తుషార్ డూడీ
బాపట్లటౌన్: శక్తియాప్ను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఎస్పీ తుషార్ డూడీ తెలిపారు. మహిళల భద్రత కోసం రూపొందించిన శక్తి యాప్ ఆవశ్యకత, వినియోగం దానిలో నిక్షిప్తం చేయబడిన పలు అంశాల గురించి మంగళవారం జిల్లాలోని ఆయా పోలీస్స్టేషన్ల పరిధిలోని మహిళలకు విస్తృతంగా అవగాహన కల్పించారు. ఎస్పీ తుషార్ డూడీ మాట్లాడుతూ జిల్లాలోని శక్తి బృందాలు జిల్లాలోని కోచింగ్ సెంటర్స్, ఫ్యాక్టరీలు, మాల్స్, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు ఇతర కార్యాలయాలు, జన సమూహం ఉండే ఇతర ప్రదేశాలతోపాటు జిల్లాలోని పలు ముఖ్యమైన ప్రాంతాల్లో మహిళలకు అవవగాహన కల్పించారు. మహిళలకు శక్తి యాప్ను ఏ విధంగా వారి మొబైల్ ఫోన్లో డౌన్లోడ్ చేసుకోవాలి, వినియోగించే విధానం, యాప్లో పొందుపరచబడి ఉన్న విస్తృతమైన సమాచారం గురించి వివరించినారు. వాటితోపాటు గుడ్ టచ్, బ్యాడ్ టచ్, బాల్య వివాహాల నిషేధ చట్టం, సైబర్ నేరాలు, ఫోక్సో చట్టం, వివిధ హెల్ప్ లైన్ నెంబర్లు వాటిని వినియోగించుకునే విధానంపై అవగాహన కల్పించారు.
వ్యవసాయ కూలీ కుటుంబాన్ని ఆదుకోవాలి
బల్లికురవ: విద్యుత్షాక్తో చనిపోయిన వ్యవసాయ కూలీ సురభి నాగేశ్వరరావు (46) కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని వైఎస్సార్ సీపీ బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్ కోరారు. సోమవారం విద్యుత్ షాకుతో చనిపోయిన నాగేశ్వరరావు భౌతిక కాయానికి సోమవారం అర్ధరాత్రి నివాళులర్పించిన అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించారు. రెక్కాడితే కాని డొక్కాడని ఈ కుటుంబానికి విధి విద్యుత్ రూరంలో తీరని అన్యాయం చేసిందని సురేష్ అన్నారు.