
మట్టి నమూనా పరీక్ష చేయించుకోవాలి
చాగంటివారిపాలెం(ముప్పాళ్ల): రైతులందరూ తమ పొలాల్లో మట్టి నమూనాలు సేకరణ చేయించుకోవాలని జిల్లా వ్యవసాయాధికారి ఐ.మురళి చెప్పారు. మండలంలోని చాగంటివారిపాలెం గ్రామంలో మట్టి నమూనాల సేకరణపై మంగళవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా వ్యవసాయాధికారి ఐ.మురళి మాట్లాడుతూ మట్టి పరీక్షలు చేయించుకోవడం వలన భూమిలోని పోషక లోపాలను తెలుసుకొని వాటిని నివారించి సాగు చేసినప్పుడే ఆశించిన ఫలితాలు వస్తాయన్నారు. చాలా మంది సాగు సమయంలో జాగ్రత్తలు తీసుకోకపోవడంతో దిగుబడులు కోల్పోవాల్సి వస్తుందన్నారు. ఏటా ఒకే రకమైన పంటలు వేయడం, ఎవరికి తోచినట్లు సాగు చేయడం, ఇష్టానుసారంగా మందులు, ఎరువులు వినియోగించడం తదితర కారణాలతో వ్యవసాయంలో అనుకున్నంతగా ఆదాయాన్ని పొందలేక పోతున్నారన్నారు. రసాయన ఎరువులు అధికంగా వాడటం వలన చీడపీడలు ఎక్కువగా ఆశిస్తాయని, దాని వలన సాగు ఖర్చు పెరుగుతుందన్నారు. అంతే కాకుండా భూసారం తగ్గి దిగుబడులపై ప్రభావం చూపుతాయన్నారు. రైతులు భూసార పరీక్షలపై అవగాహన పెంచుకోవాలన్నారు. మట్టి పరీక్షలు చేయించుకున్న రైతులకు మాత్రమే ప్రభుత్వం సబ్సిడీపై సూక్ష్మపోషకాలు అందించనుందన్నారు. మట్టి నమూనాలకు ఇదే సరైన సమయమని, రైతులందరూ ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మట్టిపరీక్షలు తప్పక చేయించుకోవాలని సూచించారు. గ్రామంలో నిర్మిస్తున్న నీటికుంటల నిర్మాణాన్ని పరిశీలించారు. కార్యక్రమంలో మండల వ్యవసాయాధికారి ఎమ్.అరుణ, వీఏఏ శైలజ, రైతులు పాల్గొన్నారు.
జిల్లా వ్యవసాయాధికారి ఐ.మురళి