
కక్ష సాధింపే కూటమి ధ్యేయం
నరసరావుపేట: కూటమి ప్రభుత్వం ప్రజాసంక్షేమాన్ని మరిచి అధికారులను అడ్డంపెట్టుకొని ప్రత్యర్థులపై కక్షసాధింపే ధ్యేయంగా పనిచేస్తుందని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. తన స్వగ్రామమైన బుచ్చిబాపనపాలెంలో కక్షసాధింపు చర్యల్లో భాగంగా గ్రామస్తులకు తాగునీరు ఆపేసి, పారిశుద్ధ్య పనులను నిలిపివేసిన సెక్రటరీ ఏకపక్ష వ్యవహార శైలిని ఖండిస్తూ గ్రామానికి చెందిన సర్పంచ్, ఎంపీటీసీలతో కలిసి కలెక్టరేట్లో నిర్వహించిన పీజీఆర్ఎస్లో జిల్లా కలెక్టర్ పి.అరుణ్బాబుకు ఫిర్యాదు చేశారు. అనంతరం డాక్టర్ గోపిరెడ్డి మీడియాతో మాట్లాడారు. గ్రామ పరిధిలో పంచాయతీ సెక్రటరీగా ఉన్న వ్యక్తి అప్పటికే అక్కడ పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులను తొలగించి ఇతర గ్రామాల నుంచి తన సొంత మనుషులను నియమించుకున్నాడన్నారు. వారు పారిశుద్ధ్యం జోలికి పోవడం లేదన్నారు. వీధిలైట్లు పనిచేయక రాత్రిళ్లు ఇబ్బందిపడుతున్నామంటూ గ్రామస్తులు చెప్పినా బాగుచేయడం లేదన్నారు. దీనికి కారణం బుచ్చిబాపనపాలెం తన సొంత గ్రామం కావడమేనన్నారు. గత ఎన్నికల్లో గ్రామస్తులు అందరూ వైఎస్సార్ సీపీకి అనుకూలంగా ఓట్లు వేశారన్న కక్షతోనే ఈ విధంగా ఇబ్బంది పెడుతున్నారన్నారు.
నాలుగు నెలలుగా నీటి సరఫరా లేదు
ఈ సెక్రటరీ గతంలో యలమంద, సాతులూరు లాంటి గ్రామాల్లో పనిచేశాడని, ఇతనిపై అవినీతి ఆరోపణలు ఉన్నాయన్నారు. ఇటువంటి వ్యక్తిని కావాలని తమ గ్రామానికి వేసి ఇబ్బందిపాలు చేస్తున్నారన్నారు. గ్రామానికి నీరందించేందుకు ఆరెకరాల చెరువుతో పాటు ట్యాంకు, పైపులైను ఉందన్నారు. బటన్ నొక్కితే తాగునీరు సరఫరా అయ్యే పరిస్థితులు ఉన్నా కూడా నాలుగు నెలల నుంచి సరఫరా చేయడందన్నారు. దీనిపై సర్పంచ్, ఎంపీటీసీ సభ్యులు అందరూ సెక్రటరీని కలిస్తే తాను పెట్టమన్నచోట సంతకాలు పెట్టాలనే షరతు విధించాడన్నారు. తన సొంత బిల్లులతో పంచాయతీ సొమ్ము డ్రా చేస్తున్నాడన్నారు. గ్రామస్తుల తరఫున కలెక్టర్, జిల్లా పంచాయతీ అధికారిని కలవటం జరిగిందన్నారు. సమగ్ర విచారణ చేయమని డీపీఓను ఆదేశించారన్నారు. వేరే గ్రామానికి చెందిన వ్యక్తులు తమ గ్రామంలో పారిశుద్ధ్య పనులు చేయాల్సిన అవసరం లేదన్నారు. గ్రామంలోనే కార్మికులు ఉన్నారన్నారు. ఈ సమస్యలు పరిష్కరించాలని కలెక్టర్ను కోరగా, ఆయన అంగీకరించారన్నారు. ఎంపీటీసీ తిరుపతయ్య గ్రామంలో జరుగుతున్న పరిస్థితిని వివరించారు. వైఎస్సార్ సీపీ జిల్లా రైతు సంఘ అధ్యక్షుడు అన్నెం పున్నారెడ్డి, మండల కన్వీనర్ కురుగుంట్ల శ్రీనివాసరెడ్డి, మాజీ కన్వీనర్ పచ్చవ రవీంద్ర, గిరిజన కార్పొరేషన్ మాజీ డైరక్టర్ పాలపర్తి వెంకటేశ్వరరావు, షేక్ కరిముల్లా, గంటెనపాటి గాబ్రియేలు పాల్గొన్నారు.
బుచ్చిబాపనపాలెంలో తాగునీరు, పారిశుద్ధ్య చర్యలు నిలుపుదలపై మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి ఆగ్రహం పీజీఆర్ఏస్లో కలెక్టర్కు ఫిర్యాదు