
రాష్ట్రస్థాయి ఇన్విటేషన్ ఫుట్బాల్ విజేత వైజాగ్
చీరాల రూరల్: యువకులు చదువుతోపాటు క్రీడలపై ఆసక్తి కనబరచి సన్మార్గంలో నడవాలని చీరాల ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య అన్నారు. స్థానిక ఎన్ఆర్అండ్పీఎం హైస్కూలు క్రీడా మైదానంలో మూడు రోజులుగా నిర్వహిస్తున్న కావూరి పవన్కుమార్ స్మారక రాష్ట్రస్థాయి ఇన్విటేషన్ ఫుట్బాల్ పోటీలు ఆదివారం రాత్రితో ముగిశాయి. ఈ పోటీల్లో రాష్ట్రంలోని అనేక నగరాలు పట్టణాలతోపాటు ఇతర రాష్ట్రాలకు చెందిన క్రీడాకారులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. నిర్వాహకులు ఎంతో శ్రమకోర్చి జాతీయస్థాయి పోటీలను తలపించే విధంగా యూ ట్యూబ్లో లైవ్ ఏర్పాటు చేశారు. పోటీలో అన్ని విభాగాల్లో రాణించి విశాఖపట్టణం శ్రీధర్ ఫుట్బాల్ జట్టు క్రీడాకారులు విజేతగా నిలిచారు. రూ.50 వేల నగదు బహుమతితో పాటు భారీ కప్ను ఎమ్మెల్యే చేతులు మీదుగా క్రీడాకారులు అందుకున్నారు. ద్వితీయ స్థానంలో హుబ్లీ జట్టు నిలిచి రూ.30 వేల నగదు బహుమతి అందుకున్నారు. తృతీయ స్థానంలో విజయవాడ జట్టు నిలిచి రూ.20 వేల నగదు బహుమతి అందుకున్నారు.
ఉత్కంఠగా ఫైనల్ ఫోరు
ఫైనల్లో విశాఖపట్టణం, హుబ్లీ జట్టు తలపడ్డాయి. మొదటి ఫస్ట్ హాఫ్లో విశాఖ జట్టు రెండు గోల్స్ చేసింది. అనంతరం సెకండాఫ్లో హుబ్లీ జట్టు పుంజుకొని రెండు గోల్స్ సాధించింది. దీంతో నిర్ణీత సమయానికి ఇరుజట్లు క్రీడాకారులు పోటాపోటీగా చిరుతపులుల్లా తలపడి ఆటను సమంగా ముగించాయి. అనంతరం అంపైర్లు ఇరుజట్లకు పెనాల్టీ షూట్ అవుట్ ఇచ్చారు. ఇక్కడ కూడా ఇరు జట్లు సమంగా నిలిచాయి. అనంతరం మరోసారి అవకాశం ఇవ్వగా వైజాగ్ జట్టు అధిక గోల్స్ సాధించి విజేతగా నిలిచింది. పోటీలలో బెస్ట్గోల్ కీపర్తోపాటు అనేక అంశాలలో సత్తాచాటిన క్రీడాకారులకు ప్రత్యేక బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో పోటీల నిర్వహకులు నూతలపాటి విజయకుమార్ (దాసు) నూతలపాటి నరేష్, బొనిగల ప్రేమయ్య, నాలుగు జిల్లాల కోఆర్డినేటర్ దేవదాసు, పంబా నాగయ్య, మున్సిపల్ కౌన్సిలర్ సల్లూరి సత్యానందం, క్రీడాకారులు, అంపైర్లు పాల్గొన్నారు.
ముగిసిన రాష్ట్రస్థాయి ఇన్విటేషన్ ఫుట్బాల్ పోటీలు ద్వితీయ స్థానంలో హుబ్లీ జట్టు విజేతలకు నగదు బహుమతులను అందజేసిన ఎమ్మెల్యే కొండయ్య

రాష్ట్రస్థాయి ఇన్విటేషన్ ఫుట్బాల్ విజేత వైజాగ్