
వేకువజామున మృత్యుఘోష
● జాతీయ రహదారిపై మూడు ప్రమాదాలు ● నిమిషాల వ్యవధిలో ఐదుగురు దుర్మరణం ● మరో నలుగురికి తీవ్ర గాయాలు ● మృతులు నెల్లూరు, గుంటూరు జిల్లావాసులు ● డ్రైవర్ నిద్రమత్తుకు బలైన బాబాయి– అబ్బాయి ● మొక్కు తీర్చుకునేందుకు వెళ్తూ తల్లీకొడుకుల మృతి ● సురక్షితంగా బయటపడిన రెండేళ్ల చిన్నారి
ఒంగోలు టౌన్: జాతీయ రహదారిపై ఒంగోలు సమీపంలోని కొప్పోలు ఫ్లై ఓవర్ వద్ద ఆదివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదాలతో నగరం ఉలిక్కిపడింది. వెంట వెంటనే మూడు రోడ్డు ప్రమాదాలు సంభవించడం... ఐదుగురి ప్రాణాలు గాలిలో కలిసిపోవడం నిముషాల వ్యవధిలోనే జరిగిపోయింది. నలుగురికి గాయాలు కాగా.. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. వారిలో ఒకరిని గుంటూరు ఆస్పత్రికి తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కొప్పోలు ఫ్లై ఓవర్ దాటిన తరువాత కొద్ది దూరంలో టైరు పంక్చర్ కావడంతో ఒక లారీ ఆగింది. సరిగ్గా అదే సమయంలో తెలంగాణ నుంచి నెల్లూరు జిల్లా గుడిపల్లిపాడు గ్రామానికి కోడిగుడ్ల లోడుతో వెళుతున్న లారీ వెనక నుంచి ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు. ఈ ప్రమాదంతో జాతీయ రహదారిపై ట్రాఫిక్ స్తంభించింది. అదే సమయంలో ప్రమాద స్థలానికి కొద్ది దూరంలో ఇటుక లోడుతో వస్తున్న ట్రాక్టర్, కారు, ఒక మినీ లారీ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదు. దానికి 500 మీటర్ల దూరంలో మరో ప్రమాదం జరిగింది. గుంటూరు నుంచి తిరుపతి వెళుతున్న కారును వెనక నుంచి వచ్చిన భారీ కంటైనర్ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు.
మొక్కు తీర్చుకునేందుకు వెళ్తూ...
పెదకాకానికి చెందిన కొప్పురావూరు గ్రామానికి తిరుమలశెట్టి వెంకటేశ్వర్లు గుంటూరులోని ఒక ప్రైవేటు పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. అమరావతి రోడ్డులో కుటుంబంతో ఉంటుస్తున్నారు. ఆయన తన సమీప బంధువైన బూచి వినయ్ కుటుంబంతో కలిసి మొక్కు తీర్చుకోవడానికి గుంటూరులో అర్ధరాత్రి రెండు గంటల తరువాత తిరుపతికి బయలుదేరారు. తెల్లవారుజామున 4.50 గంటలకు జాతీయ రహదారిపై ఒంగోలు చేరుకున్నారు. బైపాస్ నుంచి ఫ్లై ఓవర్ దిగిన తరువాత కొద్ది దూరంలో ఒక రోడ్డు ప్రమాదం జరిగి ఉండడంతో కారు ఆపారు. అంతలోనే వేగంగా వచ్చిన ఒక భారీ కంటైనర్ వారిని ఢీ కొట్టింది. ముందున్న లారీ, వెనక ఉన్న కంటైనర్ల మధ్య చిక్కుకున్న కారు నుజ్జునుజ్జయింది. ఈ ప్రమాదంలో తిరుమలశెట్టి పావని (35), ఆమె కుమారుడు చంద్ర కౌశిక్ (14) అక్కడికక్కడే మృతి చెందారు. పావని భర్త తిరుమలశెట్టి వెంకటేశ్వర్లుకు గాయాలయ్యాయి. ప్రస్తుతం షాక్లో ఉన్న ఆయనకు నగరంలోని ఒక కార్పొరేట్ ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు.
భర్త ఒంగోలులో...భార్య గుంటూరులో..
ఈ ప్రమాదంలో బూచి వినయ్ కుటుంబం పరిస్థితి దయనీయంగా ఉంది. తలకు తీవ్రంగా గాయాలైన నవీన్ కోమాలోకి వెళ్లిపోయారు. ఒంగోలులోని ఒక కార్పొరేట్ ఆస్పత్రికి తరలించారు. మెదడులో రక్తం గడ్డకట్టడంతో అత్యవసరంగా ఆపరేషన్ చేశారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం విషమంగానే ఉన్నట్లు తెలుస్తోంది. వినయ్ భార్య బూచి లావణ్యకు వెన్నెముకకు గాయం కావడంతోపాటు కాలు విరిగింది. దీంతో ఆమెకు మెరుగైన వైద్య చికిత్స కోసం గుంటూరు తరలించారు. ఈ దంపతుల రెండేళ్ల కుమారుడు లోక్ స్మిత్ సురక్షితంగా బయటపడ్డాడు. అమ్మానాన్నలు కనిపించకపోవడంతో ఆ చిన్నారి రోదిస్తుండడం స్థానికులను కలిచివేసింది.
గమ్యం చేరకుండానే..
నెల్లూరు జిల్లా గుడిపల్లిపాడు గ్రామానికి చెందిన రావినూతల బాబు (42), రావినూతల నాగేంద్ర (20) వరసకు బాబాయ్, అబ్బాయ్ అవుతారు. కోడిగుడ్లు తీసుకొని తెలంగాణలోని భువనగిరి నుంచి శనివారం రాత్రి బయలుదేరారు. మరో రెండు గంటలు గడిస్తే గమ్యం చేరుకుంటారనగా రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు బలిగొంది. ఒంగోలు–నెల్లూరు జాతీయ రహదారి మీద కొప్పోలు ఫ్లై ఓవర్ దాటగానే కొద్ది దూరం ప్రయాణించారో లేదో ఎదురుగా ఆగి ఉన్న లారీని ఢీకొన్నారు. కళ్లు తెరచి చూసే లోపలే పెద్ద శబ్దం వచ్చింది. కోడిగుడ్లన్నీ ఎగిరి రోడ్డు మీద పడ్డాయి. లారీ ముందు భాగం మొత్తం తుక్కుతుక్కయిపోయింది. లారీ డ్రైవర్ రవణయ్య అలియాస్ షేక్ రహీం (60) సహా బాబాయ్, అబ్బాయ్ దుర్మరణం పాలయ్యారు. వీరిలో ఒకరి తల ఛిద్రమైంది.
నిద్రమత్తే ప్రాణాలు తీసిందా...?
రాత్రంతా ప్రయాణం చేయడంతో తెల్లవారుజామున నిద్ర ముంచుకొని రావడంతోనే కోడిగుడ్ల లోడు లారీ ప్రమాదం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. కారును ఢీ కొన్న భారీ కంటైనర్ పరిస్థితి కూడా ఇదే. నాగాలాండ్ నుంచి రోజుల తరబడి ప్రయాణం చేయడం వలన డ్రైవర్ నిద్ర మత్తులోకి జారుకున్నట్లు తెలుస్తోంది. దాంతో పెద్ద సంఖ్యలో వాహనాలు ఆగి ఉన్నా వేగంగా దూసుకొచ్చి ఇద్దరి ప్రాణాలు పోవడానికి కారణమయ్యాడు.
వేకువజామున ఒంగోలులో నిమిషాల వ్యవధిలో జరిగిన మూడు ప్రమాదాలతో జాతీయ రహదారి రక్తసిక్తమైంది. ఈ దారుణ ఘటనల్లో ఐదుగురు విగతజీవులు కాగా.. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. ఘటనా స్థలం చూపరులకు ఒళ్లు గగుర్పాటు కలిగించేలా ఉంది. చెల్లాచెదురైన లారీ, నుజ్జు నుజ్జయిన కారులో ఇరుక్కొని పోయిన మృతదేహాలతో భయకంపితంగా మారింది. ప్రమాదం జరిగిన వెంటనే రోడ్డు మీద వందలాది వాహనాలు నిలిచిపోవడంతో గందరగోళం నెలకొంది. ఈ ప్రమాదంలో తల్లీకొడుకులు, బాబాయ్– అబ్బాయిలు విగతజీవులయ్యారు.
ప్రమాదస్థలిని పరిశీలించిన ఎస్పీ
ప్రమాదాల సమాచారం అందుకున్న ఎస్పీ ఏఆర్ దామోదర్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. భారీగా వాహనాలు నిలిచిపోయివడంతో ట్రాఫిక్ క్రమబద్ధీకరణను పర్యవేక్షించారు. ఎస్పీ మాట్లాడుతూ.. అతివేగం, నిర్లక్ష్యం వల్లనే ప్రమాదాలు జరిగినట్లు చెప్పారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. కంటైనర్ డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. మిగతా వాహనాల డ్రైవర్లు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

వేకువజామున మృత్యుఘోష