
ప్రజల ఆస్తులకు రక్షణగా ఎల్హెచ్ఎంఎస్
నరసరావుపేట టౌన్: ప్రజల ఆస్తులకు రక్షణ కవచంలా ఎల్హెచ్ఎంఎస్ (లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్) ఉపయోగపడుతుందని పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు అన్నారు. వరుస చోరీలపై ‘తాళం పడిందా.. ఇల్లు గుల్ల’ అనే శీర్షికన ఆదివారం ‘సాక్షి’లో కథనం ప్రచురితమైన విషయం విధితమే. దీనిపై స్పందిచిన ఎస్పీ.. జిల్లాలోని పోలీస్ అధికారులతో సెల్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. చోరీల నియంత్రణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఆదేశాలు ఇచ్చారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ప్రజలకు ఉచితంగా ఎల్హెచ్ఎంఎస్ మొబైల్ యాప్ సేవలు అందుబాటులో ఉన్నాయన్నారు. వేసవి సెలవుల్లో ఇతర ప్రదేశాలకు వెళ్లే వారు ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. దొంగతనాల నియంత్రణకు ఈ వ్యవస్థను ప్రత్యేకంగా రూపొందించినట్లు తెలిపారు. ఈ సౌకర్యం పట్ల ప్రజలకు అవగాహన లేకపోవడం వలన ఎక్కువ దొంగతనాలు జరుగుతున్నట్లు చెప్పారు. ఆయా పోలీసు స్టేషన్ల పరిధిలోని ప్రజలు ఇల్లు విడిచి బయట ప్రాంతాలకు వెళ్లే సమయంలో సంబంధిత పోలీసు స్టేషనుకు ముందస్తు సమాచారాన్ని అందించాలన్నారు. వారి ఇళ్లకు పోలీసులు ఎల్హెచ్ఎంఎస్ సౌకర్యాన్ని ఉచితంగా అందిస్తారన్నారు.
వినియోగించుకోండిలా..
అందరూ స్మార్ట్ ఫోనులో గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఎల్హెచ్ఎంఎస్ యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలన్నారు. ఇంటి నుంచే తమ పేరు, ఫోను నంబరు, లొకేషన్ వంటి ఇతర వివరాలు పొందుపరిచి రిక్వెస్ట్ పంపాలన్నారు. మొబైల్ నంబరుకు ఒక రిజిస్ట్రేషను నంబరు వస్తుందన్నారు. ఈ నంబరునే యూజర్ ఐడీగా పొందవచ్చునని పేర్కొన్నారు.
స్టేషన్ నుంచి పోలీసులు సదరు ఇంటిని సందర్శించి సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తారన్నారు. సీసీ కెమెరాలతో ఈ యాప్ అనుసంధానం కావడం వలన దొంగతనాలు జరగకుండా నియంత్రించవచ్చునన్నారు. ఎవరైనా అపరిచిత వ్యక్తులు ఇంటి పరిసరాలలోకి ప్రవేశించిన వెంటనే పోలీసు కంట్రోల్ రూముకు సమాచారం చేరవేస్తూ అలారం మోగుతుందని చెప్పారు. దొంగతనాల నియంత్రణలో పోలీసులకు సహకరించాలని ప్రజలను కోరారు.
వరుస చోరీలపై ‘సాక్షి’లో ప్రత్యేక కథనం స్పందించిన పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు దొంగతనాల నివారణపై అధికారులకు ఆదేశాలు