
వైవీతో పీఆర్కే, అంబటి భేటీ
మాచర్ల: రాజ్యసభ సభ్యులు వై.వి.సుబ్బారెడ్డి శుక్రవారం రాత్రి మాచర్ల వచ్చారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పల్నాడు జిల్లా అధ్యక్షుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి (పీఆర్కే) క్యాంపు కార్యాలయంలో పీఆర్కేతో భేటీ అయ్యారు. భేటీలో గుంటూరు జిల్లా అధ్యక్షులు, మాజీ మంత్రి అంబటి రాంబాబు పాల్గొన్నారు. పల్నాడు జిల్లాలో పార్టీ పరిస్థితులపై అడిగి తెలుసుకున్నారు. ప్రతి కార్యకర్తను చైతన్యపరిచి పార్టీని బలోపేతం చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. పీఆర్కే అతిథులకు తేనేటి విందు ఏర్పాటు చేశారు.
ఆశాలకు యూనిఫాం చీరెలు పంపిణీ
కార్యాలయంలో పంపిణీ ప్రారంభించిన డీఎంహెచ్వో డాక్టర్ రవి
నరసరావుపేట: జిల్లాలోని ఆశా కార్యకర్తలకు జిల్లా వైద్యఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ బి.రవి యూనిఫాం చీరల పంపిణీ ప్రారంభించారు. శనివారం డీఎంహెచ్వో కార్యాలయంలో కొంతమంది ఆశాలకు చీరెలు అందజేసి మాట్లాడారు. ఆశా కార్యకర్తలు తమ విధులు సక్రమంగా నిర్వహిస్తూ జిల్లాను ఉన్నత స్థాయిలో నిలుపుటకు తమ వంతు కృషి అందజేయాలని కోరారు. డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ పద్మావతి, జిల్లా ఇమునైజేషన్ అధికారి డాక్టర్ బి గీతాంజలి, డీపీహెచ్ఎన్ఓ సురేఖ, డీసీఎం సురేష్ పాల్గొన్నారు.
ఆర్మీ ఉద్యోగి మృతి
అమర్తలూరు(వేమూరు): అమర్తలూరుకు చెందిన ఆర్మీ ఉద్యోగి నార్ల నరేష్(34) ప్రమాదవశాత్తూ మృతి చెందాడు. నరేష్ పంజాబ్లోని పటాన్ కోటలో పని చేస్తున్నాడు. శశుక్రవారం జరిగిన ప్రమాదంలో అతను మృతి చెందినట్లు అమర్తలూరు ఎస్ఐ జానకి అమర్వర్దన్ శనివారం తెలిపారు. భార్య కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. నరేష్ భౌతికకాయాన్ని ఆదివారం ఉదయం స్వగ్రామానికి తీసుకురానున్నట్లు ఎస్ఐ తెలిపారు. అనంతరం అంత్యక్రియలు గ్రామంలో నిర్వహిస్తారని తెలిపారు.

వైవీతో పీఆర్కే, అంబటి భేటీ