
‘అర్ధ శత’ పురస్కారాల గ్రహీత బెజగంకు సన్మానం
సత్తెనపల్లి: పౌరాణిక కళారంగంలో ‘అర్ధ శత’ పురస్కారాల గ్రహీత బెజగం రవికుమార్ అని పలువురు కళాకారులు కొనియాడారు. పౌరాణిక కళారంగంలో విభిన్న పౌరాణిక పాత్రలు ధరించి ప్రేక్షకులను రంజింప చేసినందుకు రెండు తెలుగు రాష్ట్రాల స్థాయిలో వివిధ కళా సంస్థలు, కళావేదికల నుంచి మొత్తం 50 పురస్కారాలు అందుకున్న సందర్భంగా పట్టణంలోని కళాకారులందరు వర్ధమాన పౌరాణిక కళాకారుడు బెజగం రవికుమార్కి అభినందనలు తెలిపారు. పట్టణంలోని వడ్దవల్లి శ్రీ రాధాకృష్ణ మందిరంలో పట్టణ కళాకారుల సమక్షంలో వర్ధమాన పౌరాణిక కళాకారుడు బెజగం రవికుమార్ మిత్రులు, సహ కళాకారులు, శ్రేయోభిలాషులు శనివారం ఆయనను సన్మానించారు. సీనియర్ న్యాయవాది, కళా భీష్ముడు పిన్నమనేని పాములయ్య, రిటైర్డ్ ఉపాధ్యాయుడు కోటగిరి పోతులూరయ్య, చంద్రకుమారి, రచయిత్రి డాక్టర్ సరికొండ రమాదేవి శ్రీధర్ తదితరులు బెజగం రవి కుమార్కి సన్మానపత్రం చదివి వినిపించారు. అనంతరం రవికుమార్ వారందరికి ధన్యవాదాలు తెలిపారు. 10వ తరగతి పరీక్షలో 575 మార్కులు సాధించి ప్రతిభ చూపిన కోటి సాహితీని సత్కరించి పెన్నులు బహుకరించారు. కార్యక్రమంలో కళాకారులు కాటుమల నాగేశ్వరరావు, దావీదు, అంజలి కోటేశ్వరరావు, ఎలిశెట్టి ప్రసాద్, మాతంగి సాంబశివరావు, కోటేశ్వరరావు, గిరీష్రెడ్డి, సత్యనారాయణరాజు, జి.కృష్ణ, కె.ప్రేమ్కుమార్ తదితరులు పాల్గొన్నారు.