
లిఫ్ట్ గుంతలో పడి వ్యక్తి దుర్మరణం
చౌటుప్పల్: లిఫ్ట్ గుంతలో పడి వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన శుక్రవారం రాత్రి యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ పట్టణ కేంద్రంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పల్నాడు జిల్లా వినుకొండ మండలం గంగవరం గ్రామానికి చెందిన సిరిగిరి శ్రీరామమూర్తి(39) చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని లింగోజిగూడెంలో గల దివీస్ పరిశ్రమలో పనిచేస్తున్నాడు. పదిహేళ్ల నుంచి భార్యాపిల్లలతో కలిసి చౌటుప్పల్లోనే నివాసం ఉంటున్నాడు. వేసవి సెలవులు రావడంతో శ్రీరామమూర్తి భార్య ప్రశాంతి పిల్లలను తీసుకొని వారం కిందట తన తల్లిగారి ఇంటికి వెళ్లింది. దివీస్ పరిశ్రమలోనే పనిచేస్తూ చౌటుప్పల్ రత్నానగర్కాలనీలో నివాసముంటున్న తన మిత్రుడు అమర్నేని రమేష్ ఇంటికి శుక్రవారం రాత్రి శ్రీరామమూర్తి వెళ్లా డు. అక్కడ భోజనం చేసిన తర్వాత నాలుగో అంతస్తు నుంచి కిందికి దిగేందుకు లిఫ్ట్ బటన్ నొక్కాడు. లిఫ్ట్ రాక ముందే వచ్చిందని భావించిన బలవంతంగా డోర్ తెరిచి లిఫ్ట్లో ఎక్కేందుకు యత్నించి గుంతలో పడిపోయాడు. భారీ శబ్దం రావడంతో రమేష్ బయటకు వచ్చి గమనించగా తీవ్రగాయాలతో శ్రీరామమూర్తి కన్పించాడు. స్థానిక ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లగా.. అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబసభ్యులకు అప్పగించారు. మృతుడి భార్య ప్రశాంతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.