
తప్పిపోయిన వ్యక్తి కుటుంబ సభ్యులకు అప్పగింత
వెల్దుర్తి: కృష్ణా నదిలో చేపల వేటకు వెళ్లి దారి తెలియక తప్పిపోయిన వ్యక్తి ఆచూకీ పోలీసులు తెలుసుకుని సురక్షితంగా కుటుంబ సభ్యులకు అప్పగించారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంకు చెందిన కొడమంచిలి శ్రీను అలియాస్ శ్రీను వెంకట్, అతని భార్య ధనలక్ష్మిలు ఇద్దరూ చేపలు పట్టే పని కోసం వచ్చి వెల్దుర్తి మండలం జెండాపెంట గ్రామంలో నివాసం ఉంటున్నారు. శ్రీను, ధనలక్ష్మిలు ఏప్రిల్ 19 నుంచి కృష్ణానదిలో చేపలు పడుతున్నారు. రోజూ లాగే శ్రీను శుక్రవారం ఉదయం 7గంటలకు కృష్ణానదిలోకి వెళ్లి దారి తప్పిపోయాడు. నీరు, ఆహారం లేక రాత్రంతా కొత్తపుల్లారెడ్డిగూడెం ప్రాంతంలోని అడవిలో ఉండిపోయాడు. శనివారం ఉదయం 9గంటలకు డయల్ 100కి ఫోన్ చేయగా మాచర్ల రూరల్ సీఐ నసీబ్ బాషా ఆదేశాల మేరకు వెల్దుర్తి ఎస్ఐ సమందర్ వలి వెంటనే స్పందించి అతని ఫోన్ లొకేషన్ తెలుసుకొని సిబ్బంది సాయంతో ఆ ప్రాంతానికి వెళ్లి అతనిని సురక్షిత ప్రాంతానికి తీసుకు వచ్చారు. అతనిని కుటుంబసభ్యులకు అప్పగించారు. స్వగ్రామానికి వెళ్లేందుకు ఖర్చులను ఎస్ఐ సమందర్వలి అందించారు.