
పోలీసులకు శిక్షపడే వరకు పోరాటం
పిడుగురాళ్ల: సోషల్ మీడియా యాక్టివిస్టులను కొట్టిన పోలీసులకు శిక్ష పడే వరకు పోరాటం చేస్తామని మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్రెడ్డి అన్నారు. పట్టణంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శుక్రవారం రాత్రి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కాసు మహేష్రెడ్డి మాట్లాడుతూ..వైఎస్ జగన్మోహన్రెడ్డిపై అభిమానంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చురుకుగా పని చేస్తున్న బ్రాహ్మణపల్లి సర్పంచ్ కుమారుడైన మాబుపై అక్రమ కేసులు బనాయించడం దుర్మార్గమని ఖండించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చురుకుగా పని చేస్తున్నాడనే కారణంతోనే ఆరు, ఏడు నెలల కిందట మాబుపై, సోషల్ మీడియా గురజాల నియోజకవర్గ కన్వీనర్ రాజశేఖర్రెడ్డిపై పోలీసులు కేసులు పెట్టి కొట్టారని ఆరోపించారు. దానిమీద అప్పుడే హెబియస్కార్పస్ వేశామని, హైకోర్టులో పోలీసుల మీద కేసులు కూడా వేసినట్లు తెలిపారు. అప్పుడు హైకోర్టు కూడా లోయర్ కోర్టులో సమస్యలు, జరిగిన దురాగతాలను మెజిస్ట్రేట్ ముందు రికార్డు చేయాలని 10 రోజుల కిందట తీర్పు వచ్చిందని వివరించారు. వీరు జడ్జి ముందు ఏమైనా చెబుతారోమెనని అక్రమంగా బెదిరించటానికి మరొక దొంగ కేసును అన్నదమ్ములు ఇద్దరి మీద పెట్టారని కాసు వివరించారు. ఇద్దరూ జగన్మోహన్రెడ్డి సైనికులు కావడంతో పోలీసులు ఎన్ని అక్రమ కేసులుపెట్టినా, కొట్టినా ఆదరకుండా, బెదరకుండా ఉన్నారని చెప్పారు. ఎన్ని కేసులు పెట్టుకున్నా న్యాయ పోరాటం చేస్తామని ధైర్యంగా నిలబడ్డారని తెలిపారు.పోలీస్టేషన్ ముట్టడి కోసం నాయకులు, కార్యకర్తలతో సిద్ధమయ్యామని, అయితే పోలీసులు మాబుపై కేసు నమోదు చేసి రిమాండ్కు పంపిస్తామని చెప్పారు. దీంతో కోర్టులోనే న్యాయపరంగా తెల్చుకుంటామని కాసు స్పష్టం చేశారు. ఏది ఏమైనా హైకోర్టు ఇచ్చిన డైరెక్షన్పై వెనుకడుగు వేసే ప్రసక్తి లేదని చెప్పారు. కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి రేపాల శ్రీనివాసరావు, కేవీ, చల్లా పిచ్చిరెడ్డి, చింతా సుబ్బారెడ్డి, బ్రాహ్మణపల్లి సర్పంచ్ బడేసా, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్రెడ్డి
పిడుగురాళ్ల వచ్చిన సుబ్బారెడ్డి
పిడుగురాళ్ల: పట్టణంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి రాజ్యసభ సభ్యులు వై.వి. సుబ్బారెడ్డి, పల్నాడు జిల్లా అధ్యక్షులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, మాజీ మంత్రి అంబటి రాంబాబు శుక్రవారం రాత్రి వచ్చారు. అనంతరం పార్టీ నేత అల్లు పిచ్చిరెడ్డి కుమారుడి వివాహానికి హాజరయ్యారు. ఈ క్రమంలోనే గురజాల నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్రెడ్డి ఆహ్వానం మేరకు పట్టణంలోని పార్టీ కార్యాలయానికి వచ్చారు. వీరిని కాసు మహేష్రెడ్డి దుశ్శాలువాలతో సన్మానించారు. కొంతసేపు ఈ ప్రాంత రాజకీయాల గురించి సంభాషించారు. బ్రాహ్మణపల్లి గ్రామ సర్పంచ్ కుమారుడు మాబు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా యాక్టివిస్టుగా చురుకుగా పని చేస్తుండటంతో పోలీసులు అక్రమ కేసులు బనాయించి ఇబ్బందులకు గురి చేస్తున్నారని కాసు మహేష్రెడ్డి వివరించారు. కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

పోలీసులకు శిక్షపడే వరకు పోరాటం