
ప్రశ్నించే వారి గొంతు నులిమేస్తే ఎలా?
సత్తెనపల్లి: ప్రజా సమస్యలు పరిష్కరించకుండా .. వాటిని కనీసం ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్లకుండా ప్రశ్నించే వారి గొంతు నులిమేస్తే సమస్యలకు పరిష్కారం ఎలా లభిస్తుందని భవన నిర్మాణ కార్మిక సంఘం పల్నాడు జిల్లా అధ్యక్షుడు ఆవ్వారు ప్రసాదరావు ప్రశ్నించారు. అమరావతి రాజధానికి మోదీ వస్తున్న నేపథ్యంలో గురువారం రాత్రి నుంచి ప్రసాదరావును అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు ప్రయత్నాలు చేశారు. గురువారం రాత్రి ఇంట్లో సోదాలు నిర్వహించారు. ఆయన ఆ రోజు అందుబాటులో లేరు. శుక్రవారం పోలీసులు పలు ప్రశ్నలు సంధించారు. వాటికి సమాధానం చెప్పినప్పటికీ సంతృప్తి చెందలేదు. ఇద్దరు కానిస్టేబుల్లను ఇంటి వద్ద ఉంచి ప్రసాదరావును గృహ నిర్బంధం చేశారు. దీన్ని ఆయన ప్రశ్నించారు. మోదీ సభ పూర్తయ్యే వరకు నిర్బంధం తప్పదని పోలీసులు తేల్చి చెప్పారు. శుక్రవారం రాత్రి 7:30 గంటలకు పోలీసులు వెళ్లిపోవడంతో ఆయన బయటికి వచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘‘ మేము ఏమైనా దొంగలమా.. దోపిడీలు, మర్డర్లు చేశామా..మరి ఎందుకు గృహ నిర్బంధం చేశార’’ని ప్రశ్నించారు. ఇప్పటికై నా పాలకులు వాస్తవాలను గమనించి భవన నిర్మాణ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని ఆయన కోరారు. గృహ నిర్బంధాలు చేసినంత మాత్రాన ప్రయోజనం లేదని, దీనికి ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.
సీపీఎం నాయకుల హౌస్ అరెస్టులు హేయం
సత్తెనపల్లి: మోదీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని పునః నిర్మాణం ప్రారంభం కోసం వస్తున్న నేపథ్యంలో సత్తెనపల్లి నియోజకవర్గంలోని సీపీఎం నాయకులను పట్టణ పోలీసులు హౌస్ అరెస్టులు చేయడం హేయమైన చర్య అని పల్నాడు జిల్లా కార్యదర్శి గుంటూరు విజయ్కుమార్ తీవ్రంగా ఖండించారు. పట్టణంలోని పుతుంబాక భవన్లో శుక్రవారం ఆయన మాట్లాడారు. రాజధాని నిర్మాణానికి సీపీఎం వ్యతిరేకం కాదని, రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావుకు కూడా ఆహ్వానం పంపారని తెలిపారు. కానీ సభకు వెళ్లవద్దంటూ నాయకులను ఎలా అరెస్టు చేస్తారని ఆయన ప్రశ్నించారు. గురువారం రాత్రి భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు, సీపీఎం పట్టణ కమిటీ సభ్యుడు అవ్వారు ప్రసాదరావు ఇంటిని పోలీసులు సోదా చేయడాన్ని ఆయన ఖండించారు. ఆయన్ను హౌస్ అరెస్టు చేయడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. సత్తెనపల్లి రూరల్ సీపీఎం మండల కార్యదర్శి పెండ్యాల మహేష్, ముప్పాళ్ల మండల కార్యదర్శి గుంటుపల్లి బాలకృష్ణ ఇళ్ల వద్ద, సీపీఎం కార్యాలయం వద్ద పోలీసులను పెట్టి హౌస్ అరెస్ట్లు చేయడాన్ని దుయ్యబట్టారు. రాజధాని నిర్మాణానికి అవసరమైన నిధుల్ని కేంద్రం నుంచి అప్పుగా కాకుండా గ్రాంట్గా రాబట్టేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేయాలని, ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. సమావేశంలో సీపీఎం పట్టణ కమిటీ సభ్యులు జడ రాజకుమార్, ఎం. హరిపోతు రాజులు పాల్గొన్నారు.
భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు ప్రసాదరావు హౌస్ అరెస్ట్ ఇంటి నుంచి బయటకు వెళ్లకుండా పోలీసులు నిర్బంధం

ప్రశ్నించే వారి గొంతు నులిమేస్తే ఎలా?