
ఇన్విటేషన్ ఫుట్బాల్ పోటీలు ప్రారంభం
చీరాల రూరల్: క్రీడలతో మానసిక వికాసం కలగడమే కాకుండా ధృడ సంకల్పం సిద్ధిస్తుందని పలువురు వక్తలు పేర్కొన్నారు. బాపట్ల జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చీరాల ఎన్ఆర్అండ్పిఎం హైస్కూలు క్రీడా మైదానంలో శుక్రవారం రాష్ట్రస్థాయి ఇన్విటేషన్ పుట్బాల్ (9 ప్లస్ 3) పోటీలు ప్రారంభించారు. రాష్ట్రంలోని 16 క్రీడా జట్లు పాల్గొన్నట్లు నిర్వాహకులు నూతలపాటి విజయకుమార్ (దాసు) తెలిపారు. చీరాలతోపాటు ఒంగోలు, గుంటూరు, విజయవాడ, ఏలూరు, నెల్లూరు, తిరుపతి, కాకినాడ, హైదరాబాదు, విశాఖపట్టణం వంటి నగరాల జట్లు వచ్చాయని తెలిపారు. పోటీల మొదటి రోజు మూడు జట్ల క్రీడాకారులు తలపడ్డారు. మొదటగా చీరాల ఎడ్విన్ మెమోరియల్ జట్టు కాకినాడ జట్లు క్రీడాకారులు తలపడగా 3–1 స్కోరు తేడాతో చీరాల ఎడ్విన్ మెమోరియల్ జట్టు గెలుపొందింది. రెండో మ్యాచ్లో విశాఖపట్టణం శ్రీధర్ ఫుట్బాల్ జట్టు వర్సెస్ యునైటెడ్ లియోస్ జట్టు క్రీడాకారులు తలపడ్డారు. హోరాహోరీగా జరిగిన ఈ మ్యాచ్లో 3–1 స్కోర్ తేడాతో విశాఖపట్టణం శ్రీధర్ ఫుల్బాల్ క్లబ్ జట్టు గెలుపొందింది. రూ. 50,000, రూ. 30,000, రూ. 20,000 వరుస బహుమతులుగా అందజేయనున్నారు. కార్యక్రమంలో దంత వైద్య నిపుణులు డాక్టర్ అబ్రహం బ్లెస్సీ, ఎస్ఎంఎల్జే కాలేజీ ప్రిన్సిపాల్ గారపాటి పుష్పరాజు, మున్సిపల్ కౌన్సిలర్ సల్లూరి సత్యానందం, ఆర్గనైజర్ నూతలపాటి విజయకుమార్ (దాసు), అంపైర్లు, క్రీడాకారులు పాల్గొన్నారు.